
సీహెచ్ఓల నిరసన దీక్ష
కర్నూలు(సెంట్రల్): ఆరేళ్లు దాటిన సీహెచ్ఓల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీహెచ్ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు టీఎస్ చందన డిమాండ్ చేశారు. కలెక్టరేట్ నుంచి ధర్నా చౌక్ వరకు సీహెచ్ఓలు సోమవారం ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం పీఆర్సీ ఇవ్వాలన్నారు. ప్రతి నెలా జీతంతోపాటు ఇన్సెంటివ్ను ఇవ్వాలని, ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
1,940 హెక్టార్లలో పండ్ల తోటల అభివృద్ధికి చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్): 2024–25 ఆర్థిక సంవత్సరంలో కొత్త తోటల అభివృద్ధి కింద 1,940 హెక్టార్లలో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఉద్యాన శాఖ జిల్లాకు లక్ష్యాలను నిర్దేశించింది. ఎంఐడీహెచ్ కింద 890 హెక్టార్లు, రాష్ట్రీయ కృషి వికాశ్ యోజన కింద 550 హెక్టార్లలో ఉద్యాన పంటలు అభివృద్ధి చేసే విధంగా ఉద్యాన శాఖ జిల్లాకు లక్ష్యాలు ఇచ్చింది. ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని సూచించింది. ఈ ఏడాది జిల్లాలో 500 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు చేసేలా లక్ష్యాలు ఇచ్చింది. అర్హులైన రైతులను మే నెల చివరిలోగా గుర్తించాలని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు ఉద్యాన అధికారులను ఆదేశించారు.
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని కింగ్మార్కెట్ సమీపంలో ఉన్న ఈడెన్ గార్డెన్ కమ్యూనిటీ హాల్లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రి కులకు మంగళవారం వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ పరిశీలించి మాట్లాడారు. హజ్ యా త్రికులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి అవసరమైన టీకాలు వేసి సర్టిఫికెట్ ఇస్తామన్నారు. హజ్ యాత్రికులందరూ ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్(ఓరల్ పోలియో వ్యాక్సిన్, మేనింగోకోకల్, ఇన్ఫ్లూయింజా) తీసుకుని సర్టిఫికెట్ పొందాలన్నారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ నాగప్రసాద్బాబు, డిస్ట్రిక్ట్ ఎపడమాలజిస్టు వేణుగోపాల్, యుపీహెచ్సీ వైద్యాధికారులు, ఆరోగ్యపర్యవేక్షకులు, స్టాఫ్నర్సులు పాల్గొన్నారు.
రూ.60 లక్షల బంగారం పట్టివేత
ఆదోని అర్బన్: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మహమ్మద్ ఫజల్ ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకుండా బంగారాన్ని తీసుకొస్తుండగా టూటౌన్ పోలీసులు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పట్టుకున్నారు. ఈ మేరకు టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లను చూపి వివరాలను వెల్లడించారు. మహమ్మద్ఫజల్ రూ.60 లక్షల విలువ చేసే బంగారం బిస్కెట్లను ప్రొద్దుటూరు నుంచి తీసుకొస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఆ మేరకు ఆస్పరి బైపాస్ రోడ్డు వద్ద తనిఖీ నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. ఆయన వద్ద ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్యశాఖ అధికారులకు అప్పగించామన్నారు.
43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయాయి. వడగాల్పుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దొర్నిపాడు 43.9, మిడుతూరు 43.3 డిగ్రీలు, నందికొట్కూరు 43.3 డిగ్రీలు, పాణ్యం 43.7 డిగ్రీల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా కర్నూలు అర్బన్లో 43.5, కౌతాళంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, పాములపాడు, బండిఆత్మకూరు, సంజామల, శిరువెళ్ల, నంద్యాలల్లో సమాన స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సీహెచ్ఓల నిరసన దీక్ష

సీహెచ్ఓల నిరసన దీక్ష