వైఎస్సార్ సీపీ రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
అవనిగడ్డ: ప్రాజెక్టుల్లో నీరున్నా కిందికి వదలకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాన్ని చంపేయాలని చూస్తున్నారని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పులిచింతలలో అర టీఎంసీ ఉన్నప్పటికీ మాజీ మంత్రి అంబటి రాంబాబు డెల్టాకు సాగునీరు వదిలారని చెప్పారు. ఇప్పుడు 29టీఎంసీలు ఉన్నప్పటికీ సాగునీరు వదలకపోవడం వల్ల డెల్టా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సింహాద్రి చెప్పారు. వెంటనే నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోకపోతే కృష్ణా డెల్టా సర్వనాశనం అయిపోతుందన్నారు.
ఎమ్మెల్యేకి రైతుల గోడు పట్టదా?
సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పట్టించుకోవడంలేదని, నిమిషానికో మాట మాట్లాడుతారని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని సింహాద్రి అన్నారు. రైతుల దగ్గర నుంచి కొన్నప్పుడు ధాన్యం, మొక్కజొన్నకు రేటు లేదని, రైతులు నుంచి దళారులు దగ్గరకు వెళ్లాక రేట్లు ఎలా పెరిగాయని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఇష్టానుసారం వార్డుల విభజన..
ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వార్డుల డివిజన్ చేస్తోందని వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు విమర్శించారు. అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ (లచ్చి), పార్టీ అవనిగడ్డ మండలాధ్యక్షుడు రేపల్లె శ్రీనివాసరావు, పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు నలుకుర్తి పృథ్వీరాజ్, జిల్లా బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడు మద్ది వెంకటనారాయణ(చిన్న), రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి గాజుల జయ గోపాల్(గోపి) తదితరులు పాల్గొన్నారు.


