గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రైస్తవులు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎ.మెల్కీ సెదేక్, మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మతమార్పిడి నిరోధక చట్టాలు, క్రైస్తవ ఇతర మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా మంగళవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హర్షకుమార్. మెల్నీసెదేక్ మాట్లాడుతూ.. దేశంలో తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్ బిల్లును ఆమోదించాలన్నారు. జస్టిస్ కె.బాలకృష్ణన్ కమిషన్పై తమకు ఏ మాత్రం నమ్మకం లేదని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్, ఐసీఎం చర్చ్ బిషప్ జాన్, ఎం.రాజేశ్వరరావు (ఏఐసీసీ), ప్రసాద్ రవికాంత్, మహమ్మద్ కరీముద్దీన్, శ్యామ్ సుందర్, శామ్యూల్ రాజు, రూత్ భారతి, ఆర్.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ హర్షకుమార్, మెల్కీ సెదేక్


