పీహెచ్‌సీలో డీహెచ్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలో డీహెచ్‌ తనిఖీలు

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ (డీహెచ్‌) డాక్టర్‌ పద్మావతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఈహెచ్‌ఆర్‌, ఈ ఔషధి, ఫీల్డ్‌ సిబ్బంది సేవలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అన్నిరకాల మందులు అందుబా టులో ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. ఆస్పత్రిలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఐఓ డాక్టర్‌ప్రేమ్‌చంద్‌, వైద్యాధికారి సాయిలలిత, డాక్టర్‌ బిజిలీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కార్తికేయుడి ఆలయానికి రూ.లక్ష విరాళం

మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన సీహెచ్‌.వెంకటరామిరెడ్డి, వాసవి దంపతులు శనివారం రూ.1,05,116 విరాళంగా సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మధు సూదనరావుకు విరాళాన్ని అందజేశారు. చిలక లూరిపేటకు చెందిన ఎం.సి.మనోజ్‌, ఉమా వైష్ణవి 970 గ్రాముల వెండి నాగపడగ సమర్పించారు. ఆలయ అధికారి కిషోర్‌ పాల్గొన్నారు.

నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వర్షాకాలంలో అంతరాయాలు తలెత్తకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీ సీపీ డీసీ ఎల్‌) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. గుణదలలోని ఏపీసీపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో వర్చువల్‌ విధానంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు, ఈదురుగాలులు వంటి అత్య వసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో లైన్‌ లాసెస్‌ తగ్గింపు, రెవెన్యూ కలెక్షన్లు, నూతనంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనుల పురోగతి వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ సరఫరాలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యా దులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ ఎ.మురళీకృష్ణ యాదవ్‌, ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ టి.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, పలువురు సీజీఎంలు, ఎస్‌ఈలు, జీఎంలు, ఈఈలు పాల్గొన్నారు.

యోగా నిర్వహణకు వెస్ట్‌ బైపాస్‌ పరిశీలన

లబ్బీపేట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన సామూహికంగా యోగా నిర్వహించేందుకు వెస్ట్‌ బైపాస్‌ను వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ జి.వీరపాండ్యన్‌, ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గుంటూరు జిల్లా అధికారులతో కలిసి వెస్ట్‌బైపాస్‌ ప్రాంతాలను పరిశీలించారు. యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు, యోగా సాధకులు, విద్యార్థులు , వివిధ శాఖల ప్రతినిధుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా చర్యలు, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, అత్యవసర సహాయక ఏర్పాట్లు, వేదిక నిర్మాణం , ప్రజల రాకపోకలకు సంబంధించిన అంశాలపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరుజిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, ఎస్పీ వకుల్‌ జిందాల్‌, నగర డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌, కేజీవి సరిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement