కంచికచర్ల: నిత్యావసర సరుకుల కోసం దుకాణానికి వెళ్లిన యువకుడు ట్రాక్టర్ ఢీకొని దుర్మరణం చెందాడు. ఇదే ప్రమాదంలో మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కంచికచర్లలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ పి.విశ్వనాధ్ శనివారం తెలిపిన కథనం మేరకు... మండలంలోని పరిటాల గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ(28) ఓ ఐరన్ షీట్లు తయారు చేసే ప్యాబ్రిక్స్లో పని చేస్తుంటాడు. శుక్రవారం రాత్రి పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన అతడికి కుటుంబసభ్యులు నిత్యావసర సరుకులు తీసుకురావాలని చెప్పగా తన స్నేహితుడు షేక్ షరీప్బుడే కలసి స్కూటీపై దుకాణానికి కంచికచర్ల వెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా విజయవాడ వైపు నుంచి కంచికచర్ల వైపునకు కంకరలోడుతో వస్తున్న ట్రాక్టర్ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహ్మద్రఫీ తలకు తీవ్ర గాయాలు కాగా షరీప్కు కూడా తీవ్ర గాయమయింది. రఫీని వైద్య చికిత్సకోసం ప్రవేటు వాహనం ద్వారా విజయవాడలోని గొల్లపూడి ప్రవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. షరీప్ బుడేను వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. రఫీ భార్య కౌసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
స్కూటీని ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు


