ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పీవీపీ కృష్ణకుమార్ కుటుంబం రూ.1,00,116, విజయవాడ పటమటలంకకు చెందిన తోట మల్లికార్జునరావు, మల్లేశ్వరి దంపతులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనంతో పాటు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఏఈవో వెంకటరెడ్డి తదితరులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను, శేషవస్త్రాలతో దాతలను సత్కరించారు.
బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మల్టీప్లెక్స్ థియేటర్ గురువారం పునఃప్రారంభం అయ్యింది. కొంతకాలంగా థియేటర్స్లో చిత్రాలు ప్రదర్శించకపోవటంతో ప్రయాణికులు నిరాశకు గురి అవుతున్న నేపథ్యంలో రవి సినిమాస్ యాజమాన్యం ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల సహకారంతో థియేటర్స్ను ఆధునికీకరించి ప్రముఖ న్యాయవాది, పారిశ్రామిక వేత్త సిరిగిరి రవీంద్ర శేఖర్ చేతుల మీదుగా ప్రారంభించింది. తొలి రోజు పెద్ది సినిమాను ప్రదర్శించింది. నిర్వాహకులు రవి మాట్లాడుతూ మల్టీప్లెక్స్లు, మాల్స్లో సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో రవి సినిమాస్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను డిజైన్ చేసిందన్నారు. అనుమతించిన కొత్త చిత్రాలకు ప్రీమియర్ షోల వరకు టికెట్ ధరలను రూ.600 నిర్ణయించామని తర్వాత నుంచి టికెట్ ధర రూ.150 ఉంటుందన్నారు. స్టూడెంట్ ఆఫర్ కింద రూ.130, కపుల్స్కు రూ.130గా టికెట్ రేట్లను నిర్ణయించామన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో డెప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారికి తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలనశాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఇన్చార్జ్ తహసీల్దార్లుగా వ్యవహరిస్తున్న ఆయా మండలాలకు పూర్తిస్థాయిలో తహసీల్దార్లను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బి. లోకరాజు (గుడ్లవల్లేరు), బి. అంకాలు(అవనిగడ్డ), ఏఎన్ శివకుమార్రాజు(పెనమలూరు), కోట జోబాబు (బంటుమిల్లి), జీఆర్వీ భద్రరావు (గుడివాడ ఆర్డీవో కార్యాలయ ఏవో) నియమించారు. కేవీవీఎన్ మల్లేశ్వరరావు (కృత్తివెన్ను), వీఎస్ఆర్కే ప్రసాద్ (గుడివాడ), కట్టా రామశివ (మచిలీపట్నం సౌత్), ఎస్. హేమంత్కుమార్ (కలెక్టర్ కో–ఆర్డినేషన్ సెక్షన్ సూపరిండెండెంట్) నియమించారు. సి. ప్రభు కిషోర్ను కృష్ణాజిల్లా ల్యాండ్ రిఫార్మర్స్ ఆఫీసర్గా, కాగిత వీవీ చంద్రరావు(కోడూరు), ముసునూరి శ్రీహరి కలెక్టరేట్లోని మెజిస్టీరియల్ సెక్షన్ సూపరింటెండెంట్గా, ఎస్. భవానీని మోపిదేవి తహసీల్దార్గా, షేక్ వహీదారహమాన్ను పెడన తహసీల్దార్గా నియమించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణాజిల్లా అండర్–23 ఉమెన్స్ క్రికెట్ జట్టులోని క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తి చేశామని కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ప్రకటనలో తెలిపారు. కెప్టెన్గా పి.రంగలక్ష్మి, సభ్యులుగా మహమ్మద్ మోహక్, మహమ్మద్ ముస్కానా, మహమ్మద్ అంజుమ్, వి.అక్షయ, ఎం.పూజిత, టి.గుణచంద్రిక, టి.నివేదిత, ఎం.సృజన, ఏ.లక్ష్మణ్ అపర్ణ, వీ.గాయత్రీదేవి, బి.పుష్ప, ఏ.రాణి, వి.వేణుమాధవి, ఎం.లేఖన, సీహెచ్ ధనశ్రీ, కె.కీర్తి, స్టాండ్బైగా ఆర్.చేతన ప్రియ, బి.స్రవంతి, జేఎన్ఎస్ఎస్ యశశ్వని, బి.తమిళికలను ఎంపిక చేశామని తెలిపారు.


