కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బైండోవరైన వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో ఇటీవల కొంత మంది వ్యక్తుల నేర చర్యలను నియంత్రించే క్రమంలో వారిని బైండోవర్ చేయగా, వారు నిబంధనలను ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గుడివాడ టూ టౌన్, మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని ఆర్పేట, ఇనగుదురుపేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరు చొప్పున బైండోవరైన వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘించగా వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలకు ఉపక్రమించారని ఎస్పీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిలో ఇద్దరు జరిమానాలు చెల్లించేందుకు నిరాకరించగా, వారిని జైలుకు తరలించామన్నారు. మూడో వ్యక్తి ఒప్పందం ప్రకారం రూ. 50 వేల జరిమానాను చలానా రూపంలో చెల్లించారని తెలిపారు. బైండోవర్ ప్రధాన ఉద్దేశం నేరప్రవృత్తి కలిగిన వ్యక్తుల చర్యలను నియంత్రించటంతో పాటు ప్రజల భద్ర తను కాపాడటమేనని అన్నారు. బైండోవర్లో ఉన్న వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడినా చట్టం చర్యలు తీసుకుంటుందన్నారు.


