సముద్రం నీరు పాలకాయతిప్ప నుంచి ఘంట సాల మండలం పాపవినాశం వరకూ చొచ్చుకొచ్చింది. దీనివల్ల భూగర్భ జలాలు ఉప్పునీటి కయ్యలుగా మారిపోతున్నాయి. మూడు పంటలు పండే భూములున్నా సక్రమంగా సాగునీరందక పోవడంతో రెండు పంటలు సరిగా పండించలేని దుస్థితి. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు మోపిదేవి మండలం బండికోళ్లంక వద్ద కృష్ణా నదిపై చెక్ డ్యాం నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు గత ప్రభుత్వంలో పలుసార్లు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. దీంతో ఆయన పరిశీలన కోసం ప్రత్యేక బృందాన్ని పంపించగా చెక్డ్యాం అయితే భవిష్యత్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో బ్యారేజ్కు ప్రతిపాదించారు. మొదటిగా రూ.1,134 కోట్లకు ప్రతిపాదనలు పంపగా, తరువాత రూ.2,224 కోట్లకు పెంచి పంపించారు. ఈలోగా ఎన్నికలు రావడంతో ముందుకు సాగలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఊసే లేదు.


