కంకిపాడు: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను కంకిపాడు పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ జె.మురళీకృష్ణ ఘటన వివరాలను వెల్లడించారు. కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామం పామాయిల్ తోట సమీపంలో ఆరుగురు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆ ప్రాంతంపై దాడి చేశారు. దాడిలో ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి ఆరు కిలోలు గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, రూ.1900 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా (ప్రస్తుత నివాసం ఒడిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ గుంటవాడ పంచాయతీ, గులాబీ గూడా గ్రామం) చింతపల్లి క్యాంపు సీలీరుకు చెందిన కిముడు శంకర్ అలియాస్ డుల్బో, కంకిపాడు మండలం జగన్నాధపురంకు చెందిన వడ్డీ క్రాంతి రఘురామ్, మాదాసువారిపాలెంకు చెందిన గుడిసేవ జ్యోతి ప్రకాష్, గొడవర్రుకు చెందిన గండ్రపు సతీష్, పచ్చిగళ్ల నాని, ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన బొర్రా చందు ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ జె.మురళీకృష్ణ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ డీ.సందీప్, సిబ్బంది పాల్గొన్నారు. కేసు విచారణలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్ఐ సందీప్, కానిస్టేబుళ్లు బాజీ, పీఎస్ఎన్ మూర్తి, పీ.సత్యనారాయణ, హెచ్జీ మొరార్జీలను అభినందిస్తూ పారితోషికం అందించారు.


