చిలకలపూడి(మచిలీపట్నం):మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్లతో కలిసి సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ మంగినపూడి తీర ప్రాంతంలో రిసార్టుల ఏర్పాటు, 84 ఎకరాలలో పీతల పెంపకం, శాసినిధులతో తాళ్లపాలెం వంతెన నిర్మాణం, తదితర భూ కేటాయింపులకు సంబంధించి రెవెన్యూ పరిధిలో గల వివిధ రకాల భూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. నగరపాలక సంస్థ పరిధిలో రూ.13 కోట్లతో చేపట్టిన అంతర్గత మురుగునీటి వ్యవస్థ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు సాసి, భవ్య పథకాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా త్వరలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా ఏర్పాట్లు చేయాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు, వినియోగంపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఆర్డీవో సాంబశివరావు, సర్వే భూ రికార్డుల ఏడీ లక్ష్మణ్ బాబు, తహసిల్దారు నాగభూషణం, కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.


