చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న జానీ గురువారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో భార్యతో కలిసి తన సొంత ఆటోలో బయటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఉండగా భారీ గాలులతో వర్షం ప్రారంభమైంది. వర్షం నీరు ప్రవహిస్తుండగా తాను విధులు నిర్వహించే కొత్తపేట స్టేషన్ వద్దకు చేరుకునే సరికి నీటి ఉద్ధృతికి ఆటో నిలిచిపోయింది. కిందకు దిగి ఆటోను నెట్టేందుకు ప్రయత్నించాడు. గాలీవానకు తెగి నీటిలో పడిన కరెంటు తీగ తాకడంతో జానీ అక్కడికక్కడే కింద పడిపోయాడు. అక్కడే ఉన్న వారు వెంటనే మరో ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
వెలంపల్లి పరామర్శ..
మృతుని భౌతిక కాయాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


