
రైల్వే సమగ్రతలో టీటీఈల పాత్ర కీలకం
సీనియర్ డీసీఎం రాంబాబు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వే సమగ్రతను నిలబెట్టడంలో టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్లు (టీటీఈలు) కీలక పాత్ర పోషిస్తారని విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు పేర్కొన్నారు. విజయ వాడ డివిజన్లో టికెట్ తనిఖీ తీరుపై సీనియర్ డీసీఎం అధ్యక్షతన డీఆర్ఎం కార్యాలయంలోని కాన్పరెన్స్ హాలులో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యాప్తంగా స్క్వాడ్ ఇన్చార్జ్లు, ఎమినిటీస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. సీనియర్ డీసీఎం రాంబాబు మాట్లాడుతూ.. టీటీఈలు విధుల్లో అవలంబించే అంకితభావం, వృతి నైపుణ్యం, మంచి ప్రవర్తన సంస్థపై నేరుగా ప్రతిబింబిస్తాయని తెలిపారు. వారు విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తు రాయితీ కోటా దుర్వినియోగం, టికెట్ లోని పేరు మార్పులు, సరైన ఐడీ కార్డులు లేకుండా ప్రయాణించే వారిని నివారించాలని ఆదేశించారు. వారు విధుల్లో ఎదుర్కోనే ఇబ్బందుల గురించి అడిగి తెలసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అత్యుత్తమ పనితీరు కనపర్చిన టీటీలను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కమర్షియల్ మేనేజర్ బి.వి.ఎన్.ఎస్.రవి ప్రసాద్, పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్, కమర్షియల్ అధికారులు పాల్గొన్నారు.