
నాట్లలోనే నీటి గోస
నీళ్లు రావటం లేదు..
మా ఉప్పలూరు, వేల్పూరు, పునాదిపాడు, కోలవెన్ను ప్రాంతాలు కోమటిగుంటకు ఎగువన ఉన్నాయి. లాకులు వద్ద ఏడు అడుగులు లెవల్ మట్టం ఉండేలా చూడాలి. అప్పుడే పంట కాలువల్లోకి నీరు చేరుతుంది. జూన్ ఆఖరు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వరి నారుమడులను బతికించుకోవటానికి కాలువలు, మురుగు కాలువల్లో ఉన్న నీటిని ఆయిల్ ఇంజిన్లతో మళ్లిస్తున్నాం. ఎకరాకు రూ. 5 వేలు పైగా ఖర్చులు అవుతున్నాయి. మా బాధలు గుర్తించి సాగునీటి సమస్యను తీర్చాలి.
– నెరుసు రమేష్, రైతు, ఉప్పలూరు
కంకిపాడు: ఖరీఫ్ ఆరంభంలోనే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం ఉన్నా, సరైన లెవల్ నిర్వహణ జరగకపోవటంతో ఎగువ ప్రాంత పంట కాలువలకు నీరు ఎక్కడం లేదు. దీంతో ఆయా కాలువల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సాగు ప్రశ్నార్థకంగా తయారైంది. కాలువల్లో ఉన్న అడుగు బొడుగు నీటిని ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలకు మళ్లించి నారుమళ్ల సంరక్షణకు అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు.
సాగుకు సన్నద్ధం..
కంకిపాడు లాకులు పరిధిలో 35వేల ఎకరాల్లో సాగు భూమి ఉండగా కోమటిగుంట రెగ్యులేటర్ పరిధిలో 3.43లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం ఈ రెండు లాకులు నుంచి దిగువకు సాగునీటి సరఫరా అవుతోంది. బోర్ల సదుపాయం ఉన్న రైతులు మాత్రం నారుమడులు పోయటంతో పాటుగా, దమ్ములు పూర్తి చేసి వరి నాట్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇక్కట్లు వర్ణనాతీతం..
లాకులకు ఎగువ ప్రాంత రైతులు మాత్రం సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ నీటిపై ఆధారపడి సాగుకు ఉపక్రమించే అన్నదాతలు కాలువల్లో నీరు సమృద్ధిగా లేక వరి నారుమడుల సంరక్షణ, భూములను దమ్ము చేసేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. కంకిపాడు, కోమటిగుంట రెగ్యులేటర్కు ఎగువన ఉన్న పంట కాలువలకు నీరు ఎక్కకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని అనేక గ్రామాల్లో పంట కాలువలు సాగునీరు లేక, జమ్మి, తూటికాడతో అధ్వానంగా కనిపిస్తున్నాయి. అడుగుబొడుగున ఉన్న నీటిని ఆయిల్ ఇంజిన్లతో వరి నారుమడులకు, భూముల దమ్ములకు మళ్లిస్తూ వరి నాట్లకు అతి కష్టం మీద సన్నద్ధమవుతున్న పరిస్థితి.
సాగు మొదట్లోనే భారం..
ఖరీఫ్ సాగు మొదట్లోనే రైతులపై భారం మీద భారం పడుతోంది. వ్యవసాయశాఖ నుంచి విత్తనాలు పంపిణీ కూడా అరకొరగానే సాగింది. తొలకరి పలకరింపుతో పొలాలు అదును తప్పకుండా ఉండేందుకు బయటి మార్కెట్లో 30 కిలోల వరి విత్తనం బ్యాగులు రూ.1100–రూ.1200 చొప్పున కొనుగోలు చేసి వరి నారుమడులు పోసుకున్నారు. ప్రస్తుతం నారుమడులు సంరక్షించుకోవటానికి, భూములను దమ్ము చేసుకోటానికి సాగునీటికి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఎకరం పొలం ఆయిల్ ఇంజిన్లతో తడిపేందుకు 10 గంటల సమయం పడుతోంది. ఇందుకోసం ఎకరాకు రూ. 4500 నుంచి రూ.5500 వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. పంట కాలువల్లో సాగునీరు అందుబాటులో ఉంటే తూములు, గండ్లు ద్వారా పొలాలకు సమృద్ధిగా నీరు అందించుకునే వాళ్లమని రైతులు వాపోతున్నారు.
అవసరమైన లెవెల్ లేక తెరచుకోని పంట కాలువల గేట్లు ఆయిల్ ఇంజిన్లపై ఆధారపడుతున్న రైతులు ఖరీఫ్ ఆరంభంలోనే సాగుకు అన్నదాతల తంటాలు