కావాలి కనికరం! | - | Sakshi
Sakshi News home page

కావాలి కనికరం!

Jun 26 2025 6:10 AM | Updated on Jun 26 2025 6:10 AM

కావాల

కావాలి కనికరం!

అనాధీనం..

రైతులకు పట్టాలు ఇవ్వాలి..

బుడమేరు పరీవాహక ప్రాంతంలో దశాబ్దాల కాలంగా రైతులు భూములను సాగు చేసుకుంటున్నా పట్టాలు ఇవ్వకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారు. కాలువలో ఉన్న భూమి అంటూ పట్టాలు ఇవ్వడం లేదు. ఎగువన ఇదే డ్రెయిన్‌లో పట్టాలు ఇచ్చి దిగువన ఉన్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయం. వెంటనే ప్రభుత్వం స్పందించి అసైన్డ్‌ కమిటీ ద్వారా రైతులకు పట్టాలు ఇవ్వాలి.

– ఆర్సీపీ రెడ్డి, సీపీఎం నాయకుడు

తీవ్రంగా నష్టపోతున్నాం..

బుడమేరు వరదలు వచ్చినప్పుడు పంట పూర్తిగా నీట మునిగి నష్టపోతున్నాం. పట్టాలు లేని కారణంగా మాకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. పట్టాలు ఇవ్వాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకుంటూనే ఉన్నాం. మా గోడు విన్న నాయకుడే లేడు. కనీసం వ్యవసాయశాఖ నుంచి వచ్చే రాయితీలు ఇవ్వడం లేదు. మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పట్టాలు ఇప్పించాలి.

– సత్యనారాయణ, రైతు ఎల్‌ఎన్‌పురం

గుడివాడరూరల్‌: బుడమేరు పరీవాహక ప్రాంతంలోని అనాధీన భూముల్లో సాగు చేసుకునే రైతులు పట్టాలు ఇప్పించాలంటూ దశాబ్దాలుగా వేడుకుంటున్నారు. పట్టాలు లేకపోవడంతో భూములు ముంపునకు గురైనా పరిహారం రాకపోవడం, సాగుకు వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. నందివాడ మండలంలోని చేదుర్తిపాడు, ఒద్దులమెరక, పుట్టగుంట, అరిపిరాల, రామాపురం, కుదరవల్లి, ఇలపర్రు గ్రామాల పరిధిలోని బుడమేరు డ్రెయిన్‌లో దాదాపుగా 1000 ఎకరాల వరకు అనాధీన భూమి ఉంది. ఆయా గ్రామాల పరిధిలోని నిరుపేద బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల పేద రైతులు వంశపారంపర్యంగా భూములను సాగు చేసుకుంటున్నారు.

దక్కని నష్ట పరిహారం..

అనాధీన భూముల్లో సాగు చేసిన రైతులకు నష్ట పరిహారం అందించడం లేదు. ఇదే పరీవాహక ప్రాంతంలో ఎగువన విజయవాడ నుంచి బాపులపాడు మండలం వరకు పట్టాలు ఉన్న భూములకు ముంపునకు గురయ్యాయని ఎకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించారు. అనాధీన భూముల రైతులకు పట్టాలు లేవన్న సాకుతో నష్టపరిహారం ఇవ్వలేదు. వాస్తవానికి 1950కు ముందు ఇదే ప్రాంతంలో బుడమేరు కరకట్టలు నిర్మించకముందు భూములను పంట భూములుగా పరిగణించి వరదలు వచ్చిన సమయంలో నష్టపరిహారం చెల్లించారు. జలగం వెంగళ్రావు సీఎంగా ఉన్న సమయంలో బుడమేరు ఇరువైపులా కరకట్టలు నిర్మించారు. అప్పటి నుంచి కాలువల పరిధిలో ఉన్న భూములకు నష్టపరిహారం చెల్లించేది లేదని సుప్రీంకోర్టు తీర్పును వంకగా చూపి భూములకు పట్టాలు ఇవ్వకుండా నష్టపోయినా నష్టపరిహారం చెల్లించడం లేదు. ఫలితంగా రైతులు నష్టపోతూ వస్తున్నారు. ఏటా సాగు చేస్తున్నా భూములకు సంబంధించి ఈ–క్రాప్‌ నమోదు చేస్తున్నా అధికారులు పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదు. పంట నష్టం ఇవ్వని పక్షంలో ఈ–క్రాప్‌ ఎందుకు నమోదు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఒక్క రూపాయీ రాలేదు..

బుడమేరు ఆధునికీకరణ పేరిట విజయవాడ నుంచి ఇలపర్రు వరకు దాదాపుగా 5రీచ్‌లుగా విభజించి డ్రెయిన్‌ను తవ్వారు. ఆధునికీకరణలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం రూపంలో ప్రభుత్వం భారీగానే నిధులు మంజూరు చేసింది. ప్రాంతాలను బట్టి పట్టాలు ఉండి భూములు కోల్పోయిన రైతులకు రూ.లక్షల్లో పరిహారం చెల్లించింది. నందివాడ మండలంలోని అనాధీన భూముల రైతుల భూములు దాదాపుగా 100 ఎకరాలకు పైగా ఆధునికీకరణలో కోల్పోయారు. పట్టాలు లేకపోవడంతో రైతులకు ఒక్క రూపాయి నష్టపరిహారం చెల్లించలేదు. తాతలు, తండ్రుల నుంచి సాగు చేసుకుంటూ వస్తున్న భూమి ఒక్కసారిగా కోల్పోవడంతో కుటుంబాలు వీధిన పడ్డాయి. నష్ట పరిహారం చెల్లించాలంటూ భూములు కోల్పోయిన రైతులు అధికారులు, పాలకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా దక్కలేదు. గతంలో 1990కు ముందు పంట నష్టపోయి పరిహారం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పట్టా భూములుగా పరిగణించాలంటూ పాలకులు, అధికారులను వేడుకుంటున్నా కరుణించడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే బుడమేరు రైతులకు న్యాయం చేసి పట్టాలు ఇప్పిస్తామని గద్దెనెక్కిన నాయకులు పంట నష్టం ఇప్పించడంపై నోరు మెదపడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు.

దశాబ్దాల రైతు కష్టాలు తీరేదెప్పుడో?

గతేడాది బుడమేరు వరదలో పంట కోల్పోయినా పరిహారం శూన్యం ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా పట్టించుకోని పాలకులు ఈ–క్రాప్‌ చేసినా పరిహారం దక్కడం లేదని రైతుల గగ్గోలు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి

కావాలి కనికరం! 1
1/2

కావాలి కనికరం!

కావాలి కనికరం! 2
2/2

కావాలి కనికరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement