
1న వైద్యులకు అవార్డుల ప్రదానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించనున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న వారికి బెస్ట్ డాక్టర్ అవార్డ్స్–2025 అందజేయనున్నారు. ఈ అవార్డులకు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదగా అందించనున్నట్లు వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. అవార్డులు అందుకుంటున్న వారిలో జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ ఎ.అశ్విని కుమార్, కార్డియాలజిస్ట్లు డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, డాక్టర్ పి. భాస్కరనాయుడు, జనరల్ సర్జన్, డీఎంఈ–ఏపీ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం, డాక్టర్ జి.భవానీ ప్రసాద్, న్యూరో సర్జన్ డాక్టర్ కె. సత్యవరప్రసాద్, డాక్టర్ ఎం.కృష్ణనాయక్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మ శ్రీవస్తవ, డాక్టర్ ఆర్.మురళీ బాబూరావు, ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ టి.భారతి ఉన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మునిసిపల్ కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెలో వాటర్, పార్క్, వెహికల్ డిపో మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ, మలేరియా విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.