
‘వైద్య సేవ’తో నిధులు సమకూర్చుకోవాలి
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదని, ఎన్టీఆర్ వైద్య సేవ కేసులకు వైద్యం చేసి నిధులు సమకూర్చుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ) డి.వెంకటేశ్వరరావు సంబంధిత వైద్య అధికారులకు సూ చించారు. స్థానిక సర్వజన ప్రభుత్వాస్పపత్రి, మెడి కల్ కాలేజీని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ముఖ్య విభాగాలైన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఐసీసీయూ, ఎంఐసీయూ, జనరల్ వార్డు, లేబర్ వార్డులను పరిశీలించారు. ప్రతి వార్డులో వసతులు, పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవల గురించి వివరంగా విచారణ చేశారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులపై సమీక్ష నిర్వహించారు. వెంటిలేటర్ పనిచేయకపోవడాన్ని గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నచిన్న మరమ్మతులు చేయకపోవటంపై ఇంజినీరింగ్ విభాగం అధికారులను మందలించారు.
వైద్యులు స్థానికంగా నివసించాలి
మెడికల్ కాలేజీలో వైద్యులతో ఏడీఎంఈ వెంకటేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యులు స్థానికంగానే నివసించాలని, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఏర్పాటు, మౌలిక వసతుల మెరుగుదల, అవసరమైన సిబ్బంది నియామకం, పరికరాల నిర్వహణపై సమగ్ర నివేదిక సంబంధిత శాఖకు అందజేయనున్నట్లు ఏడీఎంఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఆశాలత, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ నిరంజన్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ టి.టి.కె.రెడ్డి, పలువురు వైద్యులు, వైద్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్
ఎడ్యుకేషన్ వెంకటేశ్వరరావు
ప్రభుత్వాస్పత్రి, మెడికల్ కాలేజీలో
ఆకస్మిక తనిఖీలు
వార్డుల్లో వసతులు, పరిశుభ్రత, వైద్య సేవలపై సమీక్ష
వెంటిలేటర్ పని తీరుపై అసంతృప్తి