మాదక ద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం

Jun 24 2025 4:21 AM | Updated on Jun 24 2025 4:21 AM

మాదక ద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం

మాదక ద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం

మచిలీపట్నంటౌన్‌: గంజాయి, మత్తు పదార్థాల వినియోగంతో యువత జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటోందని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.గోపి చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దిన వారోత్సవాల్లో భాగంగా సోమవారం కృష్ణాజిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం చేపట్టారు. ర్యాలీలో కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ సమాజంలోని కొన్ని అసాంఘిక శక్తుల వల్ల యువత తప్పుదారి పట్టి మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి భవిష్యత్తును అందించడానికి కృషి చేయాలన్నారు. చిన్నారులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

గంజాయి గుర్తిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1972కు

సమాచారం ఇవ్వాలి..

వ్యవస్థ పరంగా మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని జస్టిస్‌ గోపి చెప్పారు. అదేవిధంగా వాటిని అరికట్టడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. ప్రతి నేరం ఘోరం వెనుక ఈ మాదకద్రవ్యాల వినియోగం ముఖ్య భూమిక పోషిస్తోందని, యుక్త వయసుకు వచ్చిన వారి పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వారిలో అనుమానాస్పద ప్రవర్తన గుర్తించినట్లయితే వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించి వివరాలు రాబట్టాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైనట్లు గుర్తిస్తే వెంటనే వారికి అందుకు సంబంధించిన పునరావాస కేంద్రంలో కౌన్సెలింగ్‌ ఇప్పించేందుకు ముందుకు రావాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిల్వలు, వినియోగంపై ప్రజలకు ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1972కు కాల్‌ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కేవీ రామకృష్ణయ్య, మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పోతురాజు, న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్‌ గోపి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement