
ఇసుక, బుసక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
ఘంటసాల: మా లంక భూముల్లో ఇసుక, బుసుక అక్రమంగా తవ్వకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన ముదిరాజ్ ఫీల్డ్ లేబర్ కో–ఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఘంటసాల తహసీల్దార్ కార్యాలయంలో, స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధి కోడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఆర్ఎస్.నెం.176 ఏ1 నుంచి 176 ఏ80 వరకు, ఆర్ఎస్.నెం.1272లో వల్లభామాణిక్యమ్మ లంకభూమి కృష్ణానది గర్భాన ఉందన్నారు. సదరు లంక భూమిని ముదిరాజ్ కులానికి చెందిన 80 మంది నిరుపేద రైతులమైన తాము 1950 సంవత్సరానికి పూర్వం చల్లపల్లి జమిందార్ వారి నుంచి కొనుగోలు చేసి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. గతేడాది కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా లంక భూముల్లో కొంత భాగం మట్టిపొర ఏర్పడి ఇసుక, బుసక మేట వేసిందన్నారు. మా భూముల్లో మేట వేసిన ఇసుక, బుసకను బాపట్ల జిల్లా గాజుల్లంక ప్రాంతానికి చెందిన హరిదాసు అనే వ్యక్తి మాకు తెలియకుండా సుమారు 9 ఎకరాల వరకు దొంగతనంగా ఇసుక, బుసక తవ్వకాలు చేపట్టి దోచుకున్నారని ఆరోపించారు. హరిదాసుపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని విన్నవించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎన్.ఉమామహేశ్వరరావు, ఎన్వీ రామరాజు, డి.బాబు ఉన్నారు.