విలీనం కాదు... వినాశకరం | - | Sakshi
Sakshi News home page

విలీనం కాదు... వినాశకరం

Jun 22 2025 7:16 AM | Updated on Jun 22 2025 7:16 AM

విలీనం కాదు... వినాశకరం

విలీనం కాదు... వినాశకరం

మచిలీపట్నంఅర్బన్‌: రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన ప్రాథమికోన్నత పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ చర్యల ఫలితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 150 పాఠశాలలకు పైగా కుదించటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా స్థానిక చిన్నారులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఉన్న వ్యవస్థను దిగజార్చటంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

9 రకాలుగా పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ

కూటమి ప్రభుత్వం 2025–26 విద్యాసంవత్సరం నుంచి తొమ్మిది రకాల పాఠశాలలతో పాటు క్లస్టర్‌ అకడమిక్‌ టీచర్ల విధానాన్ని తీసుకువచ్చింది. జీఓ–117ను ప్రభుత్వం రద్దు చేసి, పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ చేసింది. దీంతో ఇప్పటివరకు ఊరిబడిలో చదువుతున్న విద్యార్థులు దూరంగా ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మార్చే ఆలోచనలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా చదువు మధ్యలో మానేసే పిల్లల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. పాఠశాలలను నేరుగా ఎత్తేయకుండా, భారంగా నడిచేలా ప్రభుత్వం కుట్ర చేసిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఉపాధ్యాయుల కొరత

పాఠశాలల్లో ఉపాధ్యాయులను బదిలీలతో కొంతవరకు సర్దుబాటు చేసినా కొన్ని అప్పర్‌ ప్రైమరీ పాఠశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్లను ఇవ్వలేకపోయారు. మరో పక్క మినిమం టైమ్‌ స్కేల్‌(ఎంటీఎస్‌) ఉపాధ్యాయుల బదిలీలు చేయవలసి ఉంది. 10 శాతం పోస్టులు 2025 డీఎస్సీ అభ్యర్థులతో నింపాల్సిఉంది. ఉపాధ్యాయుల కొరతతో పాఠశాలల్లో బోధన నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది.

కొత్త జీవోల వల్ల నష్టాలు

గతంలో ప్రైమరీ స్కూల్స్‌ను ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మారుస్తామంటే ప్రైమరీ స్కూల్‌ వ్యవస్థ దెబ్బ తింటుందని టీడీపీ గగ్గోలు పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 246 స్కూల్స్‌ను ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మార్చింది. వాటిలో గతంలో 20 మంది విద్యార్థుల వరకు సింగిల్‌ టీచర్‌ ఉంటే, ఇప్పుడు 30 మంది విద్యార్థులకు పెంచేశారు. ఈ నిర్ణయం కారణంగా దాదాపు 99 శాతం ఫౌండేషన్‌ స్కూల్స్‌లో సింగిల్‌ టీచర్లే ఉండే ప్రమాదం ఉంది. గతంలో దాదాపు 1,131 ప్రైమరీ స్కూల్స్‌ ఉంటే వాటిని ముక్కలు చేశారు. 929 బేసిక్‌ ప్రైమరీ స్కూల్స్‌ గా కొనసాగిస్తూ, 69 డౌన్‌ గ్రేడ్‌ చేస్తూ బేసిక్‌ ప్రైమరీ, 30 డౌన్‌ గ్రేడ్‌ చేస్తూ మోడల్‌ ప్రైమరీ, 9 హైస్కూల్స్‌లో ప్రైమరీ స్కూల్స్‌, 44 హైస్కూల్స్‌ లోనే మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ అంటూ మార్చేశారు. బేసిక్‌ ప్రైమరీ స్కూల్స్‌లో 20 మంది విద్యార్థులకి సింగిల్‌ టీచర్‌, 60 మంది వరకు ఇద్దరు టీచర్ల విధానం తీసుకొచ్చారు. మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ లో 60 మంది వరకు నలుగురు టీచర్లను కేటాయించారు. హైస్కూల్స్‌లో ఏర్పాటు చేసే ప్రైమరీ స్కూల్స్‌ లో 10 మందికి ఒక ఎస్జీటీ, 30 మందికి రెండో ఎస్జీటీ ఇస్తామని నిబంధన పెట్టారు.

అడ్డగోలు నిర్ణయాలు

ప్రైమరీ స్కూల్స్‌కి స్కూల్‌ అసిస్టెంట్‌లను తీసుకురాకూడదనే నిబంధన ఉన్నా, బీఈడీ చేసిన స్కూల్‌ అసిస్టెంట్‌లను ప్రైమరీ స్కూల్స్‌కి హెచ్‌ఎంలుగా తీసుకున్నారు. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో ఎస్జీటీలకు ప్రైమరీ స్కూల్స్‌కి హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉండదు.

యూపీ స్కూల్స్‌ విలీనంపై ప్రజాగ్రహం మూడు నాలుగు దశాబ్దాలుగా ఉన్న స్కూళ్లను మార్పు చేయటంపై నిరసన ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర ఎంఈవో కార్యాలయాల ఎదుట తల్లిదండ్రుల ధర్నాలు

సబ్జెక్ట్‌ టీచర్లు లేక ఇబ్బందులు

అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌ ఉంటే, పూర్తిగా రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వైఎస్సార్‌ సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయినా ఉమ్మడి కృష్ణాలో సుమారు 103 అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌ కొనసాగేలా, 59 హైస్కూల్స్‌/అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌ గా మారుస్తూ అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారు. అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌లో 6, 7, 8 తరగతులకు 10 మందికి ఒక సబ్జెక్ట్‌ టీచర్ని, అది కూడా హిందీ లేదా తెలుగుకు ఇచ్చారు. ముఖ్యంగా గణితం సబ్జెక్ట్‌ టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు గురికావాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement