
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యదాన నిమిత్తం శుక్రవారం రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. ఘంటసాల మండలం తూర్పులంకపల్లికి చెందిన వీరమాచనేని ప్రతాప్కుమార్, రోజా పావని దంపతులు వారి కుమార్తె థాన్వి పేరుమీద రూ. 54 వేల విలువైన కూరగాయల కటింగ్ మిషన్, నిత్యాన్నదాన పథకానికి మరో రూ. 46,116 విరాళంగా అందజేశారు. ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం విరాళాన్ని చెక్కు రూపంలో సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదననరావుకు అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
టీటీఈ నిజాయతీ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): నిబద్ధతతో ఉండేవారు నీతినిజాయతీతో ఉంటారు. దీనికి నిదర్శనం టీటీఈ అవినాష్. వివరాల్లోకి వెళ్తే అతను విజయవాడ డివిజన్ కమర్షియల్ విభాగంలో టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్). రైలులో ప్రయాణికులు మర్చిపోయిన బంగారం, నగదు కలిగిన బ్యాగును గుర్తించి ఆర్పీ ఎఫ్ సిబ్బంది సహకారంతో శుక్రవారం వాటి యజమానులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. విజయవాడలో టీటీఈగా చేస్తున్న అవినాష్ గౌతమి ఎక్స్ప్రెస్లో రాయనపాడు నుంచి కాకినాడ టౌన్ మధ్యలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఏ3 కోచ్లో 35వ నంబర్ బెర్త్ కింద గుర్తు తెలియని లగేజీని గుర్తించాడు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించి వారు వచ్చిన తర్వాత ప్రయాణికుల సమక్షంలో బ్యాగును తెరచి చూడగా అందులో రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 37 వేల నగదు లభ్యమైంది. వీటితో పాటు ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లు ఉండటంతో బ్యాగు యజమానులను గుర్తించి ఆర్పీఎఫ్ పోలీసుల సమక్షంలో వారికి అప్పగించారు. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, సీనియర్ డీసీఎం రాంబాబు.. అవినాష్ నిజాయతీని ప్రశంసించారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి
హనుమాన్జంక్షన్ రూరల్: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఈగల్ చీఫ్, ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలోని మోహన్ స్పిన్టెక్స్ కర్మాగారంలో ‘నో డ్రగ్స్ నో టెంక్షన్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మాదకద్రవ్యాల నియంత్రణపై కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ గంజాయిని సమూలంగా నిర్మూలించాలని పిలుపు నిచ్చారు. గంజాయిపై ఎలాంటి సమాచారమైన ఈగల్ టీంకు ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వాలని ఐజీ కోరారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, హనుమాన్జంక్షన్ ఎస్ఐ–2 నరసింహమూర్తి పాల్గొన్నారు.
ఒంటి కాలిపై వినూత్న నిరసన
మచిలీపట్నంటౌన్: కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ బందరు నవకళ సెంటర్లో శుక్రవారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ(న్యూ) వంటి కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు ఒంటికాలిపై నిల్చుని వినూత్న నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రపు పోలి నాయుడు మాట్లాడుతూ కార్మికుల పనిగంటలను ఎనిమిది నుంచి పది గంటల వరకు పెంచడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్ మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణకు వామపక్షాల ఐక్య పోరాటాలే ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు. ఏఐటీయూఎఫ్ నేత వెంకటరామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తానా అంటే తందానా అన్నట్టుగా వ్యవహరించడాన్నీ తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, మండల కార్యదర్శి చిరువోలు జయరావు, ఏఐటీయూసీ నాయకులు ఒంటిపులి లక్ష్మణరావు, ఎర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి విరాళం

నిత్యాన్నదానానికి విరాళం