
మా స్కూలు మాకు కావాలి!
చిలకలపూడి(మచిలీపట్నం): తమ గ్రామంలో ఉన్న పాఠశాలను అక్కడే కొనసాగించాలని గుడ్లవల్లేరు మండలం కౌతవరం హరిజనవాడకు చెందిన గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం వారు మచిలీపట్నంలో డీఈవో పీవీజే రామారావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 117 ను అనుసరించి తమ గ్రామంలోని పాఠశాలలో ఉన్న 3, 4, 5 తరగతులను రద్దు చేసి కిలోమీటరు దూరంలో ఉన్న కౌతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారని తెలిపారు. ఆ పాఠశాలకు వెళ్లే రహదారి ఎంతో ప్రమాదకరంగా ఉంటుందని, అంతేకాకుండా గుడివాడ – మచిలీపట్నం రహదారి దాటాల్సి ఉన్నందున విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఇరువురు పిల్లలు ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో ఉన్న పాఠశాలలోనే 3, 4, 5 తరగతులను పునరుద్ధరించాలని వారు అభ్యర్థించారు.
రెండున్నర కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది
ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామ శివారు ఆనందపురంలో ఎప్పటి నుంచో మండల పరిషత్ పాఠశాల నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రెండున్నర కిలోమీటర్లు దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లమంటున్నారని టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ కంభం రమేష్బాబు తెలిపారు. తమ గ్రామంలోని పాఠశాలలో ప్రస్తుతం 14 మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడిని నియమించారని, అయితే ఇంకో ఉపాధ్యాయుడిని నియమించి ఇక్కడే కొనసాగిస్తే గ్రామంలో మరికొంత మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందన్నారు. పాఠశాలను మూసివేస్తే ఉయ్యూరు, ఆకునూరు, గండిగుంట వెళ్లాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారని ఆయన డీఈవోకు వివరించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉన్న పాఠశాలలోనే మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యను బోధించాలని కోరారు. ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆయన విన్నవించారు.
ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటోంది డీఈవో పీవీజే రామారావుకు గోడు వెళ్లబుచ్చుకున్న గ్రామస్తులు