
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
అధికారులకు కలెక్టర్ ఆదేశం
చిలకలపూడి(మచిలీపట్నం): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం సాయంత్రం రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించిన బృందం సమస్యను పరిష్కరించిన అనంతరం కూడా అదే బృందం పర్యటించి అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదిక అందజేయాలన్నారు. 2025 మే నెలలో జిల్లాలో మొత్తం 69 రోడ్డు ప్రమాదాలు సంభవించగా వాటిలో 38 మరణాలు, 80 మంది గాయాలపాలయ్యారన్నారు. జాతీయ రహదారులపై అత్యధికంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. కానూరు నుంచి పెనమలూరు వరకు ఉన్న జాతీయ రహదారి డివైడర్పై రెయిలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర జంక్షన్లు, హైవే నుంచి సర్వీసు రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే చికిత్స అందజేసి మరణాల సంఖ్య తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రవాణాధికారి మనీష, జాతీయ రహదారుల పీడీ విద్యాసాగర్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని సింగ్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ శర్మిష్ట, ఆర్టీసీ డీఎం పెద్దిరాజు పాల్గొన్నారు.