
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చల్లపల్లి: ఊక లోడు తో వస్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండు స్కూటీలు, ఒక బైకు, ఒక మినీ లారీ దెబ్బతిన్నాయి. చివరకు లారీ రెండు ఇళ్ల మధ్య ఉన్న సందు లోకి దూసుకుపోయి ఆగింది. అదృష్ట వశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అవనిగడ్డకు చెందిన ఈ లారీ రేపల్లె మండలం పేటేరులోని ఒక రైసు మిల్లులో ఊక నింపుకొని పులిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా గుడివాడకు వెళ్లేందుకు బయలుదేరింది. చల్లపల్లిలోని పాగోలు రోడ్డువద్ద గల బ్రహంగారి గుడి వద్దకు రాగానే ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పాములా దూసుకురావడం ప్రారంభించింది. తొలుత ఒక మినీట్రాన్స్పోర్టు వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టగా, ఆ వ్యాను ఛాసిస్ ముందుకు జరిగి ఇంజన్ను నొక్కటంతో అది నడిరోడ్డు మీదే ఆగిపోయింది. తర్వాత ఊకలారీ పాత ఇనుపసామాను కొట్టు వద్ద పనిచేస్తున్న వ్యక్తిపైకి దూసుకురాగా, అతను గమనించి పక్కకు తప్పుకోగా లారీ అక్కడ ఉన్న ఒక స్కూటీని ఢీకొట్టి రెండు ఇళ్ల మధ్య ఉన్న సందులోకి దూసుకుపోయి ఆగింది. అక్కడ ఉన్న ఒక స్కూటీ, బైక్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. పక్కన ఉన్న షెడ్డు పాక్షికంగా దెబ్బతింది. కరెంటు స్తంభానికి ఉన్న సర్వీసు వైర్లు తెగిపడ్డాయి. ఇంత బీభత్సం సృష్టించినా ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఊక లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.