
29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఈ నెల 29వ తేదీన తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ శ్రీభాగ్య నగర్ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బుధవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. తొలుత ఆలయ దుర్గగుడి ఈవో శీనానాయక్ను కలిసి ఉత్సవం నిర్వహణ గురించి వివరించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది 29న సుమారు 500 మందితో అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నట్లు కమిటీ అధ్యక్షుడు జి.రాఘవేందర్ తెలిపారు. 29వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నామని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని ఉమ్మడి దేవాలయాల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు దుర్గగుడి దేవస్థానం తరఫున జూలై 18న అమ్మవార్లకు సారె సమర్పించేందుకు విచ్చేయాలని కోరారు.
జనగణనతో పాటే
కులగణన హర్షణీయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జనగణనతో పాటే కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న గజిట్ విడుదల చేయడం హర్షణీయమని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. విజయవాడలోని తమ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో జనగణనతో పాటే కులగణన చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక రూపాల్లో ఉద్యమాలు, నిరసనలు చేసినట్లు తెలిపారు. ఆ ఫలితంగా నేడు కులగణన చేసేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓబీసీల జనాభా కచ్చితంగా తెలిసేలా వెనుకబడిన తరగతులకు చెందిన జాతీయ స్థాయిలోని 3,746 కులాలు, రాష్ట్రంలోని 139 కులాలకు చెందిన వారందరూ తమ జనాభా వివరాలతో పాటు కులాల వివరాలు కూడా తెలియజేయాలన్నారు. అప్పుడే బీసీ కులాల జనాభా ఎంత ఉందో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ ఉద్యోగుల విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మేకా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చెప్పాడ చందు, పునుగుపాటి శ్రీనివాస్, నాయకులు వాకా వెంకటేశ్వరరావు, తెన్నేటి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
యోగా దినోత్సవాన్ని
జయప్రదం చేయండి
క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): యోగాంధ్ర కార్యక్రమం పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు ద్వారా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చాలా మండలాల్లో ఇంకా యోగా శిక్షణ తరగతులు, యోగా నిర్వహించే వేదికలు సిద్ధం చేయటంలో వెనుకబడి ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 7,72,508 మందికి గాను 3,01,107 మందికి మాత్రమే యోగా శిక్షణ తరగతులు నిర్వహించారని, మిగిలిన వారికి కూడా వెంటనే శిక్షణ పూర్తి చేయాలన్నారు. యోగా ట్రైనర్లకు ప్రతిభ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలన్నారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ రెండు వారాలుగా టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండటం సరైందికాదన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో చంద్రశేఖరరావు, జిల్లా ఆయుష్ అధికారి జావెద్ఖాన్, యోగాంధ్ర జిల్లా సమన్వయ అధికారి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం

29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం