
ఇద్దరు యువకులు దుర్మరణం
మధురానగర్(విజయవాడసెంట్రల్):రామవరప్పాడు రింగ్ సెంటర్ ఇన్ హోటల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుడివాడకు చెందిన తుమ్మాటి తనుష్ కుమార్ (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. తనుష్కుమార్ బాబాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో బాబాయిని చూసేందుకు విజయవాడ వచ్చిన తనుష్కుమార్ తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి 11.30 గంటలకు రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా ద్విచక్రవాహనంపై వచ్చిన మాదాల ఏసు (20) ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తనుష్కుమార్, ఏసులను 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాబాయిని చూడటానికి వచ్చిన తనుష్కుమార్ తిరిగి రాని లోకాలకు వెళ్లడంపై కుటుంబ సభ్యులు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంట తడిపెట్టించాయి.

ఇద్దరు యువకులు దుర్మరణం