
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మీకోసం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాల్లో సోమవారం జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో అందిన అర్జీలను చట్ట పరిధిలో విచారణ జరిపించి పరిష్కరిస్తామని చెప్పారు. బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి 42 అర్జీలు అందినట్లు తెలిపారు.