
నిధులు నీళ్ల పాలేనా?
అవనిగడ్డ: పంట కాలువకు సాగునీరు వదిలిన తరువాత పనులు చేయడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ చోద్యం చూసిన ప్రజాప్రతినిధులు కాలువకు నీరొదిలిన తరువాత పనులు చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రూ.2.25 కోట్లు నిధులు నీటిపాలేనా అని నిలదీస్తున్నారు. నియోజకవర్గంలో కేఈబీ కెనాల్తో పాటు అన్ని పంట కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు కోసం ఈ ఏడాది రూ.2.25 కోట్లు మంజూరు చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నెలరోజుల క్రితం ప్రకటించారు. వీటికి సంబంధించి కొన్నిచోట్ల మాత్రమే పనులు ప్రారంభించారు. ఇంకా కొన్నిచోట్ల పనులు మొదలుపెట్టలేదు. నెలరోజుల క్రితం ప్రకటించినా పనులు పూర్తి చేయకుండా పంట కాలువలకు సాగునీటిని విడుదల చేసిన తరువాత పనులు చేయడంపై దివిసీమ రైతులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు డెల్టాకు పూజలు చేసి సాగునీరు వదిలారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో పాటు గన్నవరం, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సోమవారం దివిసీమలోని ప్రధాన పంటకాలువలు, డ్రెయిన్లలో కలుపు మందు పిచికారీ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పాల్గొని పనులు పరిశీలించారు. ఇన్నాళ్లూ పనులు చేపట్టకుండా పంట కాలువకు సాగునీరు వదిలిన తరువాత హడావిడిగా పనులు చేయడం పట్ల దివిసీమ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటకాలువకు సాగునీరు వచ్చేలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పలుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అయినా సాగునీరు వచ్చేలోపు పనులు పూర్తి చేయించలేకపోయారు. దీనికితోడు వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో తూతూ మంత్రంగా పనులు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ జేబులు నింపుకోవడానికి మినహా రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కొంతమంది రైతులు పెదవి విరుస్తున్నారు.
ఇంకా కొన్నిచోట్ల ప్రారంభం కాని పనులు..
నియోజకవర్గంలోని ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో ఇంకా కొన్నిచోట్ల పనులు ప్రారంభించలేదు. ఈ మండలాల్లో డ్రెయిన్లలో పేరుకుపోయిన తూడు, గుర్రపడెక్కను తొలగించాల్సి ఉంది. లేదంటే కొద్ది పాటి వర్షాలకు పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గత సంవత్సరం ఇలా పనులు చేయక పోవడం వల్ల చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో నాట్లు వేసిన పొలాలు ముంపునకు గురై రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం పనులు పూర్తి కాకపోవడంతో పంట పొలాలకు ముంపు మప్పు పొంచి ఉంది.
సాగునీరొదిలాక పంటకాలువ పనులు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడుదల సోమవారం పలుచోట్ల పంట కాలువల్లో కలుపు మందు పిచికారీ