
మనమిత్ర వాట్సాప్ సేవలను సద్వినియోగం చేసుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం):జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు, ఇతర సేవల కోసం మనమిత్ర వాట్సాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహ మండలి సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక వసతులకు సంబంధించి ఆయాశాఖల వద్దకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. సముద్రనాచు పెంపకానికి సంబంధించి ప్రాజెక్టు ఏర్పాటుకోసం మత్స్యకార మహిళలను సమకూర్చాలని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పారిశ్రామికవేత్త కనకదుర్గ కలెక్టర్ను కోరారు. అలాగే వ్యర్ధ, కాటన్ దుస్తులతో పర్యావరణ రహిత సంచులు, పరీక్ష ఫ్యాడ్లు, సెల్ఫోన్ స్టాండ్లు తదితర వస్తువులు తయారుచేస్తున్నామని వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆమె కోరారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని డీఆర్డీఏ పీడీ కు కలెక్టర్ సూచించారు. పోతేపల్లి జ్యూయలరీ పార్కులో తాగునీటి వసతి, డ్రెయినేజీ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ను జ్యూయలరీ పార్కు ప్రతినిధులు కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పైప్లైన్ ఏర్పాటు చేసి తక్షణమే నీటి వసతి కల్పనకు కృషి చేయాలన్నారు. గుడివాడలోని ఆటోనగర్లో చెల్లింపు పద్ధతిలో సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు, కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం స్థల సేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, డీపీవో జె అరుణ, మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు తదితరులు
పాల్గొన్నారు.
జిల్లాలో 3.50 లక్షల మొక్కలు
నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయండి
జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరు నెలలో 3.50 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సోమవారం సాయంత్రం మొక్కల పెంపకంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 2.51 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. వాటన్నింటిని సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. జిల్లాలో ఇంకా 3.50 లక్షల మొక్కలను వివిధ పాఠశాలలు, వసతిగృహాలు, గ్రామపంచాయతీల్లో నాటేందుకు ప్రణాళికను తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నగరంతో పాటు అన్ని పట్టణాల పరిధిలో ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటే ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశంలో డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్యాదవ్, డీఎఫ్వో సునీత, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డీపీవో జె.అరుణ, డీఈవో పీవీజె రామారావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ