
19న యోగాసన, చిత్రలేఖన పోటీలు
విజయవాడస్పోర్ట్స్: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి యోగాసన పోటీలు, యోగాసనాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్.మురళీకృష్ణ తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చేతుల మీదుగా కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందన్నారు. ఈ మేరకు సర్వోదయ ట్రస్ట్, కృష్ణా జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ పేటలోని బందర్ లాకులు వద్ద ఉన్న సర్వోదయ ట్రస్ట్, కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘ భవనంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆ రోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు యోగాసనా పోటీలు, పది నుంచి 12:00 వరకు చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. పోటీల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారు 9441119909(యోగా), 9502944913 (చిత్రలేఖనం) నంబర్లను సంప్రదించి ముందస్తుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించడంతోపాటు పాల్గొన్న వారికి పార్టిసిపేషన్, మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామని వివరించారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సర్వోదయ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ జి.వి.మోహన్ ప్రసాద్, కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.