
భక్తిశ్రద్ధలతో గుడారం, మద్దిరావమ్మ సంబరం
భావదేవరపల్లి(నాగాయలంక): పూర్వీకుల నూరేళ్ల అచ్చమైన మత సామరస్యానికి ప్రతీక.. మండలంలోని భావదేవరపల్లి గ్రామదేవత ఉర్వేళమ్మ జాతర. మహోత్సవాల్లో ఇందుకు తార్కాణంగా శనివారం రాత్రి మత సమ్మిళిత ఆధ్యాత్మిక వైచిత్యాన్ని ప్రదర్శించారు. గ్రామంలో మూడేళ్లకొకసారి నిర్వహించే గ్రామదేవత ఉర్వేళమ్మ జాతరకు ముందుగా పూర్వీకుల సంప్రదాయం రీత్యా మదార్ సాహెబ్ గుడారం సంబరం జరిగింది. గ్రామంలో మదార్ సాహెబ్ జెండా ఊరేగింపు తర్వాత పెదగుడు మోటుకు చెందిన మత పెద్ద మదీనాకృష్ణ ఆధ్వర్యంలో గుడారం వద్దకు చేరుకున్నాక భక్తులు మదార్ సాహెబ్కు మూడేసి చొప్పున రొట్టెలు, గంధపు ఉండలు, చుట్టలు, జెండాలు, చిల్లర నాణేలు సమర్పించారు. అనంతరం గ్రామస్తులు దీపజ్యోతుల అలంకారంతో కూడిన వేడి నైవేద్యాలతో భారీ ఊరేగింపుగా ఉర్వేళమ్మ ఆలయం సమీపంలోని మద్దిరావమ్మ స్థావరానికి తరలివెళ్లి వాటిని సమ ర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాత్రి వేళ మద్దిరావమ్మ సంప్రదాయ కథను పంబలోళ్లు గానం చేయగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఆసక్తిగా విన్నారు. ధర్మకర్త భోగాది విశ్వేశ్వరరావు, సర్పంచ్ మండలి ఉదయభాస్కర్, ముమ్మారెడ్డి వెంకట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.