తొలిరోజు 172 మంది గైర్హాజరు
ఆసిఫాబాద్రూరల్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 19 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రతీ కేంద్రం వద్ద ముగ్గురు పోలీస్ సిబ్బందితో బందోబస్తు కల్పించారు. సెక్షన్ 163 పకడ్బందీగా అమలు చేశారు. విద్యార్థులు ఉదయమే 40 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి తనిఖీల అనంతరం లోపలికి అనుమతించారు. ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు తొలిరోజు 5,211 మంది విద్యార్థులకు 5,039 మంది హాజరు కాగా 172 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 4,438 మందికి 4,316 మంది, ఒకేషనల్ విభాగంలో 773 మందికి 723 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఐఈవో రాందాస్ తెలిపారు.
పరీక్ష కేంద్రాలు తనిఖీ
జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ కె.హరిత తనిఖీ చేశారు. పరీక్ష తీరును పరిశీలించి సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, బోర్డు ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్యసిబ్బందితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. డీఐఈవో రాందాస్ రెబ్బెన ప్రభుత్వ కళాశాలలోని కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను ఎస్సై కమలాకర్, స్క్వాడ్ బృందాల సభ్యులు పర్యవేక్షించారు.


