ప్రజల సహకారం అవసరం
సమగ్ర
భూసర్వేకు
ఆసిఫాబాద్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టే సమగ్ర భూసర్వేకు ప్రజల సహకారం అవసరమని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండలంలోని దానాపూర్లో బుధవారం తహసీల్దార్ రియాజ్ అలీ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం భూముల వివరాలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. సర్వేలో అటవీశాఖ అధికారులను సైతం భాగస్వాములను చేసి వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సర్వే సమయంలో ఏర్పడే ఇబ్బందులను జిల్లాస్థాయిలోనే సరిచేద్దామని, ప్రతీ అంశాన్ని తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వరరావు, సర్పంచ్ రాము తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా రుణ లక్ష్యాలు సాధించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు గడువులోగా సాధించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం 2025– 26 సంవత్సర మూడో త్రైమాసిక సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఎం ముద్ర రుణాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధికి కేటాయించిన రుణాలు, పీఎం స్వయం ఉపాధి పథకం, విశ్వకర్మ, జన సురక్ష పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,023 కోట్ల రుణ లక్ష్యానికి ఇప్పటివరకు రూ.1,581కోట్ల(49 శాతం) రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పంచాయతీల అభివృద్ధి నిధులు దుర్వినియోగం కాకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం 2026– 27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పథకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం వీరభద్రుడు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీవో రాములు, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ గుప్తా, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, డీటీడీవో రమాదేవి, బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


