![పాఠశాలల్లో పనులు పూర్తి చేయండి](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24asb176r-340009_mr.jpg.webp?itok=t0PEKGkj)
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కెరమెరి(ఆసిఫాబాద్): అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులు గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని ఝరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాంనగర్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. ఫ్లోరింగ్, వంటగదుల్లో మర్మమతులు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా తదితర పనులు వేగవంతం చేయాలని సూచించారు. అంతకు ముందు కెరమెరిలోని యూనిఫాం కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పాత పద్ధతుల్లో కత్తెరలతో వస్త్రం కట్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ యంత్రాలు వస్త్రం కట్ చేయాలని, విద్యుత్ కుట్టు మిషన్లతో యూనిఫాంలు కుట్టాలని సూచించారు. జూన్ 12లోగా విద్యార్థులకు యూనిఫాంలు అందించాలన్నారు. ఆయన వెంట ఎస్వోలు భరత్, శ్రీనివాస్, యూనిఫాం క్లాత్ ఇన్చార్జి మధుకర్, ఏఈ నజీమొద్దిన్, ఎంఈవో సుధాకర్, ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీవో అంజద్ పాషా, ఏపీఎం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
జైనూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతులు 2024– 25 విద్యాసంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని దబోలి మండల పరిషత్ పాఠశాలలో పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. బాలికల కోసం ప్రత్యేక మూత్రశాలలు నిర్మించాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.