ఖమ్మం లీగల్: కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు సూచించారు. ఈనెల 12న లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యాన సోమవారం బ్యాంకులు, ఫైనాన్స్, బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి నాగరాజు మాట్లాడుతూ రాజీకి అవకాశమున్న పెండింగ్, ప్రీలిటిగేషన్ కేసులను గుర్తించి సంబంధిత పక్షాలతో సంప్రదింపులు జరిపి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని తెలిపారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే సత్వర న్యాయం లభించడంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.దేవీమానస, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ లైబ్రరీ కమిటీ చైర్మన్గా
ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లిటౌన్: తెలంగాణ అసెంబ్లీ లైబ్రరీ కమిటీ చైర్మన్గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్గా నియమించిన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలి పారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అసెంబ్లీ లైబ్రరీ అభివృద్ధికి, సభ్యులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీక ర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు కమిటీ సభ్యులు, అధి కారులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎంబీఏలో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పీజీ సెంటర్లోని ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు మంగళవారం నుంచి గురువారం వరకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఐసెట్–2026లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు కాగా, కేటగిరీల వారీగా 21 సీట్లు అందుబాటులో ఉన్నాయని కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.గోపి తెలిపారు. వివరాలకు కళాశాలలో కానీ, 94406 52571, 9912263863 నంబర్లలో కానీ సంప్రదించాలని ఆయన సూచించారు.
రైతు శిక్షణా కేంద్రం అధికారిగా సరిత
ఖమ్మంవ్యవసాయం: జిల్లా రైతు శిక్షణా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్గా బి.సరితకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న కనకరాజు సోమవారం ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ సరితకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏఓ బాధ్యతలు డీఆర్వోకు..
ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) కారుమంచి శ్రీనివాసరావు సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) రామమూర్తికి ఏఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
గ్రూప్స్ అభ్యర్థులకు
ఉచిత ఫౌండేషన్ శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్–2, 3, 4 పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత శిక్షణ ఫౌండేషన్ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారి ముహమ్మద్ ముజాహిద్ తెలిపారు. ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెంది, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 14లోగా హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు 97040 03002 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.


