ప్రత్యామ్నాయ పంటలు
ఎల్నినో ప్రభావంతో
పంటల సాగు అంతంతే..
వర్షాభావంతో వెనకబడినట్లు గుర్తింపు
ఈనెల 2.18 లక్షల ఎకరాల్లో
పంటల సాగుకు ప్రణాళిక
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురుకాగా, పంటల సాగు మందకొడిగా సాగుతోంది. ఈమేరకు ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు పంటలు సాగు చేయని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలుచేయనుంది. ప్రాంతాలు, పంటల సాగు విస్తీర్ణం, విత్తన నిల్వల ఆధారంగా ప్రణాళికలతో నివేదిక సిద్ధం చేశారు.
189 గ్రామాల్లో తీవ్ర ప్రభావం
జిల్లాలోని 471 గ్రామాలకు గాను 189 గ్రామాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరో 62 గ్రామాల్లో మధ్యస్థ ప్రభావం ఉంది. ఇక 220 గ్రామాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితుల ప్రభావం లేదని వ్యవసాయ శాఖ గుర్తించింది. తీవ్ర వర్షాభావం ఉన్న గ్రామాల్లో పాలేరు వ్యవసాయ డివిజన్లో 54, సత్తుపల్లి డివిజన్లో 49 గ్రామాలు, మధిర డివిజన్లో 42 గ్రామాలు, వైరా డివిజన్లో 26 గ్రామాలు, ఖమ్మం డివిజన్లో 18 గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. జూన్లో కొంత మేర వర్షాలు కురిసినా, జూలైలో ఆ పరిస్థితి లేక పంటల సాగు వెనకబడుతోంది.
2.77 లక్షల ఎకరాల్లో వెనకంజ
జిల్లాలో జూలై 15 నాటికి 6,18,412 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ వర్షాల ఆధారంగా 1,43,533 ఎకరాల్లో, నీటి పారుదల కింద 1,97,117 ఎకరాల్లో మొత్తం 3,40,650 ఎకరాల్లోనే పంటలు వేశారు. ఇంకా 2,77,762 ఎకరాల్లో వెనుకబడినట్టేనని వ్యవసాయ శాఖ చెబుతోంది.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తాం. ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన, నీటి పారుదల శాఖల సంయుక్త ఆధ్వర్యాన గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం. నేలలు, నీటి వనరులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తక్కువ కాల పరిమితి, లాభసాటి పంటల సాగు వివరాలు వెల్లడిస్తాం.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి
ఈనెల 15నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని 2,18,565 ఎకరాల్లో పంటల సాగు చేయించాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో అత్యధికంగా వరి 1,71,908 ఎకరాలు ఉండగా, పెసర 11,603 ఎకరాలు, మినుము 1,996, మొక్కజొన్న 895, కంది 715, కూరగాయలు 612, అలసంద 597, పశుగ్రాసం జొన్న 370, ఉలవలు 50, ఇతర పంటలు 29,819 ఎకరాలను ప్రణాళికలో చేర్చారు. ఈ పంటలకు 43,667.604 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, ఇప్పటికే 12,389.81 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన విత్తనాలను కూడా సిద్ధం చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇక మరో 59,197 ఎకరాల్లో పంటల సాగుకు వర్షాల ఆధారంగా ఆగస్టులో ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.


