మధ్యలో మొరాయించిన బస్సు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని అంబేద్కర్ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పలుచోట్ల పరీక్షా కేంద్రాలు కేటాయించారు. విద్యార్థులను బస్సుల్లో తీసుకెళ్తుండగా మమత రోడ్డులోని పరీక్ష కేంద్రానికి వెళ్లే బస్సు మరమ్మతుకు గురై మధ్యలో ఆగిపోయింది. దీంతో ఆటోలో వెళ్లగా ఆరుగురు విద్యార్థులు 20నిమిషాల ఆలస్యంగా చేరుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ అనుదీప్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సూచనలతో విద్యార్థులను అనుమతించారు. కలెక్టర్ చొరవతో తమ పిల్లలకు న్యాయం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
● ఖమ్మంమయూరిసెంటర్: అంబేద్కర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్కు కలెక్టర్ అనుదీప్ మెమో జారీ చేశారు. గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ ద్వారా ప్రిన్సిపాల్కు మెమో ఇప్పించారు. కళా శాల ప్రథమ సంవత్సరం విద్యార్థినులు పరీక్షకు ఆలస్యంగా వెళ్లడంపై వివరణ ఇవ్వాలని అందులో సూచించారు. విద్యార్థినులను తీసుకెళ్తున్న బస్సు మరమ్మతు కారణంగా ఆలస్యమైంది. అయితే, ముందు పంపించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక గురువారం నుంచి ప్రతీ సెంటర్కు ఒక వాహనం ఏర్పాటుచేయాలని తెలి పారు. ప్రతీ వాహనంలో ఎస్కార్ట్గా అధ్యా పకులను కేటాయించి కేంద్రాలకు సమయానికి చేరుకునేలా పంపించాలని సూచించారు.
● చింతకాని: మండలంలోని నాగులవంచ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని బుధవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. మరో గంటలో పరీక్ష ముగుస్తుందనగా ఆమె వాంతులు చేసుకుంటూ కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో అధికారులు ఆటోలో పల్లె దవాఖానాకు తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఆమె మూడు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోందని తెలిసింది. డాక్టర్ వేణుమాధవ్ చికిత్స చేసి కుదుటుపడ్డాక విద్యార్థిని ఇంటికి పంపించారు.
కలెక్టర్ చొరవతో విద్యార్థులకు అనుమతి


