ఆయిల్ఫామ్ సాగుపై రైతులకు అవగాహన
ఎర్రుపాలెం/పెనుబల్లి: ఎర్రుపాలెం మండలం నారాయణపురం, పెనుబల్లి మండలం అగ్రహారంలో రైతులకు ఆయిల్పామ్ సాగుతో లాభాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం శాస్త్రవేత్త ఐవీ.శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్రావు పాల్గొని ఏళ్ల తరబడి ఆదాయం లభంచే ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీలు, అంతర పంటల సాగుకు ఉన్న అవకాశాలను వివరించారు. అలాగే, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, గెలల కోత సమయాన జాగ్రత్తలపై పంట సాగు చేస్తున్న రైతులకు సూచనలు ఇచ్చారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, మధిర ఏడీఏ ఎస్.విజయచంద్ర, డీడీఎస్ ముత్యాలు, ఉద్యానవన అధికారి జి.నగేష్, ఆయిల్ఫెడ్ అధికారులు శంకర్, రామకృష్ణ, సర్పంచ్లు మరియమ్మ, తల్లపురెడ్డి నాగిరెడ్డి, ఏఓలు బి.సాయిశివ, ఏ.విష్ణు, ఏఈఓ వంశీకృష్ణతో పాటు ఫీల్డ్ ఆఫీసర్లు నాగలక్ష్మి, యుగంధర్ పాల్గొన్నారు.
శివాలయం ఆదాయం రూ.16.78లక్షలు
కల్లూరు: మహా శివరాత్రి సందర్భంగా కల్లూరులోని శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రానికి హుండీలతో పాటు ఇతర మార్గాల్లో రూ.16,78,800 ఆదాయం నమోదైంది. ఈమేరకు దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ ఆర్.సమత ఆధ్వర్యాన భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. వీటితో పాటు అభిషేకం టికెట్లు, కళ్యాణ కట్నాలు, ఇతర వ్యాపారాల వేలం ద్వారా రూ.16, 78,800 ఆదాయం సమకూరిందని వెల్లడించారు. అయితే, గత ఏడాది కంటే రూ.16 వేలు తగ్గిందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ మేనేజర్ ఎస్వీడీ.ప్రసాద్, ప్రధాన అర్చకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
జమలాపురం క్షేత్రానికి పాదయాత్ర
మధిర: మధిర మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ సామినేని సుజాత రామనాథం, కోనా ధనికుమార్తో పాటు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు శనివారం ఇల్లెందులపాడు నుంచి జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వాన మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్కు దక్కాయని తెలిపారు. దెందుకూరు సొసైటీ మాజీ చైర్మన్ కోట వెంకటకృష్ణ, కౌన్సిలర్లు నకిరికంటి గోవిందు, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధి నివారణకు కృషి
చింతకాని: క్షయ వ్యాధి సోకడానికి కారణాలపై అవగాహన పెంచుకుని నివారణకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు సూచించారు. చింతకాని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం మొబైల్ ఎక్స్రే యంత్రం ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశాక ఆయన మాట్లాడారు. వారం రోజులకు పైబడి దగ్గు, జ్వరం, ఆయాసం, క్రమంగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. క్షయ సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి పూర్తిస్థాయిలో తగ్గుతుందని చెప్పారు. వైద్యాధికారి ఆల్తాఫ్, ఉద్యోగులు వీరేందర్, హిమామ్ తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ఫామ్ సాగుపై రైతులకు అవగాహన
ఆయిల్ఫామ్ సాగుపై రైతులకు అవగాహన


