ముందస్తు పరీక్షలతో తలసేమియా నివారణ
● ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం ● ‘సంకల్ప’ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
ఖమ్మంవైద్యవిభాగం: ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా తలసేమియాను నివారించడం సాధ్యమవుతుందని ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం తెలిపారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన ఖమ్మంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి ప్రారంభమైన ప్రభుత్వ ఆస్పత్రివరకు కొనసాగగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ ప్రతినిధులు, వైద్యులు, పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెహానా బేగం మాట్లాడుతూ తలసేమియా జన్యుపరంగా వచ్చే వ్యాధి అని, పిల్లల్లో వ్యాధి సోకినప్పుడు తీవ్ర రక్తహీనత, జాండిస్ వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. తరచుగా రక్తం ఎక్కించాల్సి రావడంతో వారి జీవితకాలం తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు. ఈమేరకు గర్భిణులు ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా తలసేమియా రహిత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భవిష్యత్లో వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ కార్యదర్శి డాక్టర్ సాయిభార్గవ్ మాట్లాడగా సంకల్ప సంస్థ వ్యవస్థాపకులు పి.అనిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి కోటేశ్వరరావు, వైద్యలు డి.నారాయణమూర్తి, లక్ష్మీదీప, నరేష్తో పాటు మమత, అనురాధ, పి.పావని, ఉదయభాస్కర్, రవిచందర్, వంశీ కిరీటి, నెల్లూరి ఉపేందర్, వంశీ, నవీన్ పాల్గొన్నారు.
ముందస్తు పరీక్షలతో తలసేమియా నివారణ


