పారిశుద్ధ్య లోపం ఎదురుకావొద్దు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య లోపం ఎదురుకావొద్దు

Apr 4 2025 12:17 AM | Updated on Apr 4 2025 12:17 AM

పారిశ

పారిశుద్ధ్య లోపం ఎదురుకావొద్దు

ముదిగొండ: గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య లోపం ఎదురుకాకుండా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. ముదిగొండ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేసిన ఆమె రికార్డులు పరిశీలించాక మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, పారిశుద్ధ్య సమస్య, నీటిఎద్దడి ఎదురుకాకుండా చూడాలని సూచించారు. డీఎల్‌పీఓ రాంబాబు, ఎంపీఓ వాల్మీకి కిశోర్‌, పంచాయతీ కార్యదర్శి రామకృష్ట పాల్గొన్నారు.

షాదీఖానా వద్ద ముస్లింల ఆందోళన

ఖమ్మంమయూరిసెంటర్‌: ఏటా రంజాన్‌ తర్వాత జరుపుకునే ఈద్‌ మిలాప్‌ కార్యక్రమానికి అధికారులు కావాలనే అడ్డుపడుతున్నారని ముస్లింలు ఆందోళనకు దిగారు. ఖమ్మంలోని షాదీఖానాలో శుక్రవారం సాయంత్రం నిర్వహించుకునేందుకు తొలుత అనుమతి ఇచ్చిన అధికారులు రద్దు చేయడంపై గురువారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ నేతల వైఖరితోనే ఇలా జరుగుతోందని వారు ఆరోపించారు. చివరకు షాదీఖానాలో శుక్రవారం ఈద్‌ మిలాప్‌ నిర్వహించుకునేందుకు తహసీల్దార్‌ అనుమతి ఇవ్వగా వారు ఆందోళన విరమించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఖమర్‌, తాజుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

బధిరురాలి గర్భానికి కారణమైన బంధువు

అరెస్ట్‌ చేసిన పోలీసులు

తిరుమలాయపాలెం: పింఛన్‌ కోసం వచ్చే బంధువు, బధిరురాలైన మహిళను నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. మండలంలోని సుబ్లేడులో మినీ ఏటీఎం నిర్వహిస్తున్న కామళ్ల వీరయ్య వద్దకు ఆయన బంధువు, 34 ఏళ్ల మూగ, చెవిటి మహిళ పింఛన్‌ కోసం వచ్చేది. ఈ క్రమంలో ఆమెను నమ్మించిన వీరయ్య శారీరకంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులకు విషయం తెలియగా ఇటీవల ఆయనను నిలదీశారు. కానీ, ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించడంతో వారు పోలీ సులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత 25న కేసు నమోదు చేయగా, గురువారం వీరయ్యను అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

అసత్యప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు

ఖమ్మంక్రైం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘానికి చెందిన కొందరు నాయకులు.. జేఏసీలో భాగస్వామ్య పక్షమైన టీఎన్జీవోస్‌ యూనియన్‌, హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీపై అసత్యప్రచారం చేస్తున్నారని అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్‌ తెలిపారు. ఈమేరకు వారిపై గురువారం ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని ఓ ప్రకటనలో వెల్లడించారు.

పారిశుద్ధ్య లోపం ఎదురుకావొద్దు 1
1/1

పారిశుద్ధ్య లోపం ఎదురుకావొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement