హొసపేటె: ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి శంకర్ నాయక్ సూచించారు. జిల్లా యంత్రాంగం, రోటరీ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన మల్లిగే పారా మెడికల్ కళాశాల, తుంగభద్ర స్కూల్ ఆఫ్ నర్సింగ్, దీపాలి స్కూల్ ఆఫ్ నర్సింగ్ సంస్థల సహకారంతో శనివారం మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రాంగణంలో పల్స్ పోలియోపై అవగాహన జాతా నిర్వహించారు. ఈసారి ప్రజల సాకర్యార్థం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. క్యూఆర్ కోడ్ స్క్యాన్ చేయడం ద్వారా సమీపంలోని పోలియో టీకా కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. దేశాన్ని సంపూర్ణ పోలియో రహితంగా మార్చేందుకు ప్రజలందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. నగరంలోని మదర్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ (పాత ఆస్పత్రి ప్రాంగణం) నుంచి ప్రారంభమైన ర్యాలీ.. పుణ్యమూర్తి సర్కిల్, బస్టాండ్, పునీత్ రాజ్ కుమార్ సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, రామ టాకీస్ మీదుగా సాగి, దొడ్డ మసీదు మార్గ్ నుంచి మదర్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రాంగణంలో ముగిసింది. కార్యక్రమంలో జిల్లా ఆర్.సి.హెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, ఆరోగ్య ఇన్స్పెక్టర్ ధర్మాన గౌడ, జిల్లా డిప్యూటీ ఆరోగ్య విద్యా అధికారి ఎంపీ దొడ్డమణి, తాలూకా వైద్య అధికారి డాక్టర్ వినోద్ కుమార్, ఆరోగ్య శాఖ సిబ్బంది, వివిధ నర్సింగ్ కళాశాలల విద్యార్థులు సంస్థల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


