● డీసీఎం డీకే శివకుమార్ మండిపాటు
శివాజీనగర: కేంద్ర మంత్రి కుమారస్వామికి తమను విమర్శించకపోతే రాజకీయ మనుగడ అసాధ్యం అని, మేం మంచి పనులు చేసినా కుమారస్వామి వ్యతిరేకిస్తారని డీసీఎం డీ.కే.శివకుమార్ మండిపడ్డారు. శుక్రవారం సదాశివనగరలోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. కుమారస్వామి బిడది టౌన్షిప్ ప్రాజెక్ట్ను విమర్శించిన విషయంపై స్పందిస్తూ, కుమారస్వామి జారీ చేసిన ప్రాజెక్టునే మేము ముందుకు కొనసాగిస్తున్నాం. తాను రైతుల వద్ద మాట్లాడేందుకు సమయం, తేదీ నిర్ధారించుకొని వెళతానని అన్నారు. నేడు కాదు, భవిష్యత్తులో 20 సంవత్సరాల తరువాత బిడది, బెంగళూరు దక్షిణ ప్రజలు తనను జ్ఞాపకం చేసుకొంటారన్నారు. కుమారస్వామి ఈ ప్రాజెక్ట్ భూమిని డీనోటిఫై చేయవచ్చు కదా? ఎందుకు చేయలేదు? తాను డీనోటిఫై చేసేందుకు సిద్ధంగా లేను. ఆయన డీనోటిఫై చేసి ఎంత అనుభవిస్తున్నారో ఆయనకు, యడియూరప్పకు, తనకు తెలుసునని ఎదురుదాడికి దిగారు.
ధరల పెరుగుదల మోదీ కానుక
మోదీ ఇతర దేశాలతో ఉత్తమ సంబంధాలు కాపాడుకోలేదు. అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించటంలో విఫలమయ్యారు. అందుకు విద్యుత్ పొదుపు చేయాలని, పెట్రోల్ వినియోగించరాదని చెబుతున్నారు. ఇంధనాలను వినియోగించకుండా జీవితం సాగించటమెలా? చాలా మంది కాన్వాయ్ వాహనాలను తగ్గిస్తున్నారు. అయితే సామాన్య ప్రజలు తిరగకుండా ఉండేందుకు ఎలా సాధ్యం? బంగారు కొనుగోలు చేయవద్దంటే ఎలా? అన్నారు. వివాహం చేసుకునే యువతులకు మంగళసూత్రం కావాలి. అలాంటప్పుడు బంగారం కొలుగోలు చేయరాదంటే కుదురుతుందా అని ప్రశ్నించారు.
ఎన్నో బ్యానర్లను తీయించాను
తానే బ్యానర్ వేయవద్దని, కేసులు పెడతామని చెప్పాను. అయినా అభిమానంతో వేశారు. పలువురికి చెప్పి బ్యానర్లను తీయించాను. 50 శాతం బ్యానర్లు తొలగించారన్నారు.
మందుబాబులకు గుడ్ న్యూస్
● బీర్, విస్కీ ధరల తగ్గింపు
బనశంకరి: రాష్ట్రంలో మందుబాబుకు ఎకై ్సజ్ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మే 11 నుంచి కొత్త ఆల్కహాల్ ఇన్ బేవరేజస్(ఏఐబీ) విధానాన్ని అమలు చేసింది. దీంతో ప్రీమియం బీర్, విదేశీ స్కాచ్ విస్కీ ధరలు గణనీయంగా తగ్గాయి. కొత్త ఎకై ్సజ్ విధానం ప్రకారం 5 శాతం ఆల్కహాల్ కలిగిన సాధారణ, లాగర్ బీర్ల ధరలను 20 నుంచి 25 శాతం తగ్గించింది. కింగ్ఫిషర్ ప్రీమియం, ఆల్ట్రా 650 మిలీబాటిల్స్ వంటి పేరొందిన బ్రాండ్ల ధరను రూ.75 మేర తగ్గించారు. హైనెకెన్ బీర్ ధర రూ.70, యూబీ ఎక్స్పోర్ట్స్ ధర రూ.25, బడ్వైసర్ ప్రీమియం ధర రూ.20 మేర తగ్గించారు. బీర్ మాత్రమే కాకుండా విదేశీ ప్రీమియం స్కాచ్ విస్కీ ధరను సైతం 20 శాతం తగ్గించారు. బ్లాక్ లేబల్, చివాస్ రీగల్ లాంటి ప్రజాదరణ పొందిన బ్రాండ్ల 750 మిల్లీబాటిల్ ధర రూ.5,190 నుంచి రూ.4,100కు తగ్గింది. ఇది ప్రీమియం మద్యంప్రియులకు వరంగా మారింది. సాధారణ ప్రజలు తాగే తక్కువ ధర మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం కొత్త పన్ను విధాన పద్ధతితో తక్కువ ధర కలిగిన మద్యంపై భారీ భారం మోపింది. దీంతో సాధారణ ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఏఐబీ విధానం దేశంలో మొదటి ప్రయోగం. మద్యంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్ను విధించే వ్యవస్థను రూపొందించారు. గతంలో ఉన్న 16 స్లాబ్ల విధానాన్ని ప్రస్తుతం 8కి తగ్గించారు. సుమారు 6 దశాబ్దాల పాత పన్ను వ్యవస్థను రద్దు చేసి కొత్త విధానంలో పన్ను వ్యవస్థను అమల్లోకి తెచ్చారు.


