హొసపేటె: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాలూకా కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవికిరణ్ జేపీ మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేవలం ఒక పరీక్ష సంస్థ వైఫల్యం మాత్రమే కాదు.. ఇది లక్షలాది నిజాయతీగల విద్యార్థుల చెమట, కలలపై జరిగిన ఘోరమైన అమానుష చర్య అని తెలిపారు. కేవలం మూడేళ్లలో ఇది రెండో సారి ప్రశ్నపత్రం లీక్ చేశారన్నారు. నీట్ కోచింగ్ కోసం సంవత్సరానికి రూ.80 వేల నుంచి రూ.3 లక్షల వరకు విద్యార్థులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఇంత ఖర్చు చేసి 3–4 ఏళ్లుగా పగలు, రాత్రి నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. కొద్దిమంది ప్రయోజనం కోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.


