హొసపేటె: సాధారణంగా రోడ్డు మీద లేదా బస్సులో డబ్బు లేదా బంగారు ఆభరణాలు దొరికితే చాలా మంది వాటిని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకుని అదృశ్యమవుతారు. అయితే విజయనగర జిల్లా కొట్టూరు నుంచి దావణగెరె జిల్లా జగళూరు మధ్య తిరిగే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ నిజాయితీని ప్రదర్శించారు. బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు తాను మర్చిపోయిన బంగారం, డబ్బును గురువారం ఆమెకు తిరిగి ఇచ్చి వేసిన బస్సు కండక్టర్, డ్రైవర్ ప్రశంసలు అందుకున్నారు. కొట్టూరు నుంచి జగళూరు వెళ్తున్న బస్సులో ఒక ప్రయాణికురాలు తన పర్సును మర్చిపోయి దిగిపోయారు. బస్సు కండక్టర్ బసవరాజ్ ఆ పర్సును గుర్తించి తెరిచి చూడగా అందులో 10 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1000 నగదు లభించాయి. ఇంతలో ఆ బస్సు జగళూరు నుంచి ఉజ్జయినికి చేరుకుంది. ఇంతలో తన పర్సు బస్సులో మర్చిపోయానని గ్రహించిన ఆ మహిళ ఉజ్జయినికి వెళ్లే మరో బస్సు ఎక్కి వెళ్లి కండక్టర్ బసవరాజ్ను సంప్రదించింది. అప్పుడు బసవరాజ్ ఏ మాత్రం సంకోచించకుండా ఆ మహిళ పోగొట్టుకున్న డబ్బు, బంగారు ఆభరణాలతో సహా పర్సును తిరిగి ఇచ్చేశాడు.


