అరకు లోయ టు బాగేపల్లి
● 22 కేజీల గంజాయి సీజ్
బాగేపల్లి: బాగేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయి లభించింది. ఇద్దరిని అరెస్టు చేసి లక్షలాది రూపాయల విలువచేసే 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీఐ అజయ్ సారథి, పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి బెంగళూరు–హైదరాబాద్ హైవేలో నరేపల్లి టోల్ ప్లాజాలో తనిఖీలు చేపట్టారు. ఇద్దరు దుండగులు రెండు బ్యాగులు పట్టుకుని నిలబడి ఉన్నారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా చుట్టుముట్టి వారిని ప్రశ్నించారు. రెండు బ్యాగుల్లో తనిఖీ చేయగా 22 కిలోల గంజాయి దొరికింది. ఆ గంజాయిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలోని అరకు లోయ నుంచి తీసుకువచ్చి బాగేపల్లి, బెంగళూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులు ఒడిశాకు చెందిన రాంబాబు కించే, సింఘానా హంటల్ అని, కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఎస్పీ కుశాల్ చౌక్సి, అదనపు ఎస్పీ జగన్నాథ్ రాయ్, డీఎస్పీ ప్రకాష్.ఆర్ పరిశీలించారు.


