జరిమానాతో గుణపాఠం
బనశంకరి: రాష్ట్రంలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాల్లో సంచరించడం, సీట్బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారికి ఇకపై జరిమానాతో పాటు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిబంధనలు, వాటిని పాటించాల్సిన ఆవశ్యకత గురించి ట్రాఫిక్ పోలీసులు క్లాస్ తీసుకుంటారు. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్సు(డీఎల్) సస్పెండ్ లేదా రద్దు చేయడానికి రవాణాఽ శాఖకు సిఫార్సు చేస్తారు. సుప్రీంకోర్టు రోడ్డు సురక్షతా సమితి ఆదేశాల పాలనపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. ట్రాఫిక్ పోలీసుల సమాచారం ప్రకారం 2025లో బెంగళూరు నగరంలో 69,88,400 వివిధ రకాల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా హెల్మెట్ ధరించని కేసులు ఉండటం విశేషం. 20.33 లక్షల కేసులు బైకులు డ్రైవింగ్ చేసే వ్యక్తులపైనా, 11.27 లక్షల కేసులు ద్విచక్రవాహనాల్లో వెనుక కూర్చున్న వ్యక్తులు హెల్మెట్ ధరించనందుకు కేసులు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేసుల సంఖ్య
మిగిలిన 7.59 లక్షల కేసులు సీటు బెల్ట్ ధరించని వారిపై కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య భారీగా ఉంది. హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదాల్లో మృతుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతపై జాగృతం చేయాలని సుప్రీంకోర్టు రోడ్డు సురక్షత సమితి ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ రోడ్డు సురక్షత కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు డ్రైవర్లు లేదా వాహనదారులు డీఎల్ సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడానికి రవాణా శాఖకు సిఫార్సు చేయాలి. ప్రతినెల డీఎల్ సస్పెండ్ సిఫార్సు వివరాలను కచ్చితంగా డీజీపీ ప్రధాన కార్యాలయానికి పంపించాలని అన్ని నగర పోలీస్ కమిషనర్, జాయింట్ పోలీస్ కమిషనర్, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇకపై హెల్మెట్ ధరించని, సీట్బెల్ట్ పెట్టుకోని వారికి జరిమానా
రెండు గంటలపాటు నిబంధనలపై ట్రాఫిక్ పోలీసుల పాఠాలు
జరిమానాతో గుణపాఠం


