ఆస్తి కోసం అక్కను చంపిన చెల్లి, ఆమె తనయుడు
తుమకూరు: తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి పట్టణంలో ఒక మహిళను ఆమె సొంత చెల్లి తన కొడుకుతో కలిసి గొంతు కోసి చంపి, సహజ మరణంగా చిత్రీకరించడానికి యత్నించిన ఘటన జరిగింది. మృతురాలిని పట్టణ నివాసి జయలక్ష్మి(58)గా గుర్తించారు. ఆమె తురువేకెరెలోని ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయంలో ఫస్ట్ క్లాస్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. జయలక్ష్మి చెల్లి అనసూయ, ఆమె కుమారుడు చంద్రశేఖర్ గురువారం తెల్లవారుజామున జయలక్ష్మిని గొంతు కోసి చంపారు. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో మరణించినట్లు చూపించడానికి నిందితులు కుట్ర పన్నారు. మృతురాలి అంత్యక్రియలకు అన్ని సన్నాహాలు జరుగుతుండగా, బంధువులు జయలక్ష్మి మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు అక్కడికి చేరుకుని, అంత్యక్రియలను ఆపి, మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. అనుమానం వచ్చిన అనసూయ, చంద్రశేఖర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆస్తి కోసమే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోస్ట్మార్టం నివేదికలో కూడా వెల్లడైంది. కాగా జిల్లా ఎస్పీ కే.వీ.అశోక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పరిశీలన
బనశంకరి: ట్రాఫిక్ నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా వినియోగించే బెంగళూరు నగర ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం(టీఎంసీ)ను నెదర్లాండ్ ప్రధానమంత్రి డిక్స్కూప్ శుక్రవారం సందర్శించారు. బెంగళూరు నగర ట్రాఫిక్ వ్యవస్థ నిర్వహణలో సాంకేతిక ఆధారిత పరిజ్ఞానం వినియోగం, దాని ప్రగతి గురించి డిక్స్కూప్ సమాచార వివరాలను అడిగి తెలుసుకున్నారు. సురక్షిత సంచారానికి ట్రాఫిక్ పోలీసులు వినియోగించే ఏఐ కెమెరాలు, రియల్ టైమ్ ట్రాఫిక్ మానిటరింగ్, అడ్వాన్స్డ్ సిగ్నల్ సిస్టమ్స్పై ట్రాఫిక్ పోలీస్ అధికారులు డిక్స్కూప్కు వివరించారు. డీజీపీ ఎంఏ.సలీం, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్, నగర ట్రాఫిక్ విభాగ అదనపు కమిషనర్ కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్తి కోసం అక్కను చంపిన చెల్లి, ఆమె తనయుడు


