
23న జిల్లాకు సీఎం సిద్దరామయ్య రాక
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో ఈనెల 23న ముఖ్యమంత్రి సిద్దరామయ్య పర్యటిస్తారని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రూ.3 కోట్లతో 12 చర్చిలు, 35 మసీదులు, దర్గాలకు రూ.2.85 కోట్లు, రూ.222 కోట్లతో చెరువుల అభివృద్ధి, 12 గ్రామాల్లో రూ.3 కోట్లతో సామూహిక మరుగుదొడ్లు, రూ.7 కోట్లతో రెండు ఆరోగ్య కేంద్రాలు, రూ.48 కోట్లతో రాయచూరు విశ్వవిద్యాలయంలో జెనెటిక్ భవనం, రూ.2 కోట్లతో ట్రీ పార్కు, రూ.24 కోట్లతో పాఠశాల గదుల నిర్మాణం, రూ.6 కోట్లతో సముదాయ భవనాలు, రూ.111 కోట్లతో బీటీ రోడ్లు, రూ.289 కోట్లతో తాగునీటి పథకాలు, రూ.152 కోట్లతో బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారన్నారు. కల్యాణ కర్ణాటక పరిధిలో ఆర్టికల్– 371(జే) అమలై దశాబ్దం కానున్న తరుణంలో సీఎంను అభినందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. యరగేరలో గిరిజన ఉత్సవాలను సీఎం ప్రారంభిస్తారన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మంత్రులు పాల్గొంటారన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎంపీ కుమార నాయక్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జునగౌడ, జయంతిరావ్, కరీం, అస్లాంపాషా, తాయన్న, నాగేంద్ర, పంపాపతి, చంద్రశేఖర్, రాజశేఖర్, రామస్వామిలున్నారు.
పలు అభివృద్ధి పనులకు ఆరోజున
ముఖ్యమంత్రి శ్రీకారం
రూ.936 కోట్లతో పనులు జాతికి అంకితం