
అపహరణకు గురైన బాలుడు సురక్షితం
హుబ్లీ: గత రెండేళ్ల నుంచి కిడ్నాప్ గురైన బాలుడు బెంగళూరులో లభించడంతో అతడిని స్థానిక పోలీసు బృందం స్వస్థలానికి చేర్చడంలో విజయవంతమైంది. జిల్లాలోని కలఘటిగి తాలూకా సంగె దేవరకొప్ప గ్రామానికి చెందిన బ్రహ్మానంద అనే బాలుడు 2023 అక్టోబర్ 6న పాఠశాలకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అయితే ఆ బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ గోపాల బ్యాకోడ సూచనలతో కలఘటిగి స్టేషన్ సీఐ శ్రీశైల కౌజలిగి తమ సిబ్బందితో నిరంతరం గాలించి ఎట్టకేలకు బాలుడి ఆచూకీని కనుగొని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.
పాలికె కమిషనర్
బదిలీ ఆదేశాలు రద్దు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ నగర పాలికె కమిషనర్గా సీనియర్ గ్రేడ్ కేఏఎస్ అధికారి మంజునాథ్ డొంబరను నియమిస్తూ వెల్లడించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. పాలికె కమిషనర్గా ఉన్న రుద్రేష్ గాళిని బదిలీ చేసిన మూడవ రోజే బెంగళూరు అభివృద్ధి ప్రాధికార ప్రత్యేక భూస్వాధీన అధికారి మంజునాథ్ డొంబరను నియమిస్తూ గురువారం రాత్రి ఆదేశాలు వెల్లడించింది. అయితే శుక్రవారం ఉదయం ఇద్దరి ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రుద్రేష్నే కమిషనర్గా కొనసాగేలా తాజాగా ఆదేశాలను ఇచ్చింది. హుబ్లీ ధార్వాడ నగరాభివృద్ధి ప్రాధికార కమిషనర్ కేఏఎస్ సీనియర్ గ్రేడ్ అధికారి డాక్టర్ సంతోష్ బిరాదార్ను కూడా బదిలీ చేసింది. ఈయన స్థానంలో కేఏఎస్ జూనియర్ గ్రేడ్ అధికారి దేవరాజ్ను నియమిస్తూ ప్రభుత్వం వెల్లడించిన ఆదేశాలు కూడా రద్దు కావడంతో డాక్టర్ సంతోష్ బిరాదారే హుడా కమిషనర్గా కొనసాగనున్నారు.
23న నగర పాలికె సమావేశం
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ నగర పాలక సంస్థ సాధారణ సమావేశం సోమవారం జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు పాలికె సభాభవనంలో ఏర్పాటు చేసినట్లు పాలికె పరిషత్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.
రేపు కసాప అధ్యక్షుడి పర్యటన
హొసపేటె: కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ మహేష్ జోషి ఈనెల 22న విజయనగర జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు హొసపేటెలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని పత్రికా భవన్లో బళ్లారి జిల్లా కసాప అధ్యక్షుడు వివేకానంద గౌడ పాటిల్, హావేరి జిల్లా కసాప అధ్యక్షుడు లింగయ్య బీ.హిరేమట్, కలబుర్గి జిల్లా కసాప అధ్యక్షుడు విజయ్కుమార్ పాటిల్, రాయచూరు జిల్లా కసాప అధ్యక్షుడు రంగన్న పాటిల్, కొప్పళ జిల్లా కసాప అధ్యక్షుడు శరణేగౌడ పోలీస్ పాటిల్ సమక్షంలో విలేకరుల సమావేశం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బళ్లారిలో జరగనున్న 88వ అఖిల భారత కసాప సదస్సుకు సన్నాహకంగా జరిగే సంప్రదింపుల సమావేశంలో సీనియర్ రచయితలు, ఇతర కన్నడ అనుకూల సంస్థల పదాధికారులు పాల్గొంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.
ప్రతిభావంతులకు సన్మానం
రాయచూరు రూరల్: విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్త రవి పేర్కొన్నారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జామియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైనార్టి సమాజం ప్రతిభావంత విద్యార్థు లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. నేడు విద్యకున్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. కార్యక్రమంలో నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద సమీర్, శాలం, హసన్, నూర్ మహ్మద్, ఇక్బాల్, అక్బర్లున్నారు.

అపహరణకు గురైన బాలుడు సురక్షితం