
ప్రమాదం పొంచి ఉన్న జిల్లాలు
బనశంకరి: నైరుతి వర్షాల నేపథ్యంలో 31,261 చదరపు కిలోమీటర్లలో భూమి కుంగడం, కొండచరియలు విరిగిపడే ప్రదేశాలను గుర్తించగా ఇందులో 2,252 గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. ఈమేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార తన నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరావళి జిల్లాల్లో వరదలు, భూమి కుంగిపోవడం, కొండచరియలు విరిగిపడే ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. ఈ నేపథ్యంలో రెవిన్యూ శాఖ వరదలు, భూమి కుంగిపోవడం, ఇతర విపత్తులకు గురయ్యే ప్రదేశాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. సుమారు 29 తాలూకాల్లో 1,164.52 చదరపు కిలోమీటర్లు ప్రదేశంలో అత్యధికంగా భూమి కుంగిపోయే ప్రమాదం ఉండగా, 5,386.79 చదరపు కిలోమీటర్ల పరిధిలో కొండచరియలు విరిగిపడనున్నాయి. 24,710.11 చదరపు కిలోమీటర్లలో భూమి కుంగిపోయే ప్రమాదం ఉందని ఆ నివేదికలో పొందుపరిచారు.
ఆయా జిల్లాల్లో వివరాలివే..
ప్రదానంగా దక్షిణ కన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, కొడగు, ఉడుపి, హాసన జిల్లాల్లో అధికంగా భూమి కుంగడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. భారతీయ భూ విజ్ఞాన సమీక్ష, రాష్ట్ర నైసర్గిక విపత్తు నిర్వహణ సమితి నివేదిక ప్రకారం కర్ణాటకలో కనీసం 15.30 శాతం భూభాగం కుంగిపోయే ప్రమాదం పొంచి ఉంది. రెవెన్యూ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 2006 నుంచి ఇప్పటివరకు సుమారు 1,541 చదరపు కిలోమీటర్ల మేర భూమికుంగిపోగా, కొండచరియలు విరిగిపడటంతో 101 మంది మృత్యవాత పడ్డారు. రెవెన్యూశాఖ కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార నివేదిక ప్రకారం ఉత్తరకన్నడలో అత్యధికంగా 8,389.26 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో భూమి కుంగిపోయే ప్రమాదం ఉంది. శివమొగ్గలో 4,797.97 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో భూమి కుంగిపోనుంది. దక్షిణకన్నడ జిల్లాలో సుమారు 4,600 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో భూమి కుంగిపోవడం, కొండచరియలు విరిగిపడటం జరుగనుంది. కొడగులో 4,150 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో భూమి కుంగిపోయే అవకాశం ఉంది.
2,252 గ్రామాలకు
వరద ముప్పు
భూకంపం, కొండచరియలు
విరిగిపడతాయి
రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార
నివేదికలో వెల్లడి
చిక్కమగళూరులో సుమారు 4,100 చదరపు కిలోమీటర్ల ప్రదేశం, ఉడుపిలో 2,650 చదరపు కిలోమీటర్లు, హాసనలో 1,100 చదరపు కిలోమీటర్లు ప్రదేశంలో భూమికుంగిపోయే ప్రమాదం ఉంది. బీబీఎంపీ పరిధిలో 201 ప్రాంతాలకు ముంపు ముప్పు ఉన్నట్లు గుర్తించారు. బెళగావిలో 230 గ్రామాలు, బాగల్కోటలో 203 గ్రామాలు, విజయపురలో 76 గ్రామాలు, ఉత్తరకన్నడలో 208 గ్రామాలు, చిత్రదుర్గలో 51 గ్రామాలకు వరదల ముంపు ఉంది. బీదర్లో 51 గ్రామాలు, శివమొగ్గలో 216 గ్రామాలు, కలబుర్గిలో 153 గ్రామాలు, గదగలో 43 గ్రామాలు, బళ్లారిలో 19, కొప్పళలో 27, హావేరిలో 80, దక్షిణకన్నడలో 90, ఉడుపిలో 86 గ్రామాల్లో వరదలు, భూమి కుంగిపోయే ప్రదేశాలుగా గుర్తించింది. మండ్యలో 112, చామరాజనగరలో 21, చిక్కమగళూరులో 85 గ్రామాలు, కొడగులో 88 గ్రామాలు, యాదగిరిలో 80 గ్రామాలు, హాసనలో 81 గ్రామాలు, ధార్వాడలో 56, తుమకూరులో 13 గ్రామాలు, రాయచూరులో 26 గ్రామాలు, విజయనగరలో 22, మైసూరులో 63, రామనగరలో 17 గ్రామాలు, దావణగెరెలో 55 గ్రామాలను వరదలు, భూమికుంగిపొయే ప్రదేశాలుగా గుర్తించారు. వరదలు, భూమికుంగిపోవడం, కొండచరియలు విరిగిపడే ప్రదేశాల్లో రెవెన్యూ, పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పాలనాధికారి, పోలీస్ ప్రతినిధి, అగ్నిమాపక శాఖ ప్రతినిధి, ఆరోగ్యశాఖ ప్రతినిధి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధి, పశుసంవర్దక శాఖ ప్రతినిధులతో కూడిన నగర, స్థ్దానిక సంస్థలు, గ్రామీణ స్థ్దానిక సంస్థలు విపత్తు నిర్వహణ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని సూచించింది.

ప్రమాదం పొంచి ఉన్న జిల్లాలు

ప్రమాదం పొంచి ఉన్న జిల్లాలు

ప్రమాదం పొంచి ఉన్న జిల్లాలు