
జొన్నలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి
బళ్లార్అర్బన్: జిల్లాలో ప్రముఖ పంట జొన్న, డిసెంబర్ లేదా జనవరిలో దిగుబడి చేసుకున్న జొన్నలను ఇంటి ముందే రైతులు నిల్వ చేసుకున్నారు. అంతేగాక రబీ సీజన్ ప్రారంభం అయితే రైతులు పండించిన ఆ పంట నష్టం అవుతుందని తక్షణమే గోడౌన్లలో ఉన్న నిల్వలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కన్నడ నాడు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మెణసిన ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో డీసీ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన తర్వాత జిల్లాధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఈశ్వరప్ప మాట్లాడుతూ ఈ నెల 30న జొన్నల కొనుగోళ్లు నిలిపి వేస్తామని ఆదేశాలు ఇచ్చారన్నారు. సదరు ఆదేశాలను మరో నెల పాటు పొడిగించాలని ఆయన కోరారు. కొనుగోలు కేంద్రంలో సుమారు 3796 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 2,95,428 క్వింటాళ్ల జొన్నలు నమోదు అయ్యాయి. 81,863 క్వింటాళ్ల జొన్నలు ఆ మేరకు తూకం వేశారు. మిగిలి ఇంకా 2,13,565 క్వింటాళ్ల జొన్నలు మార్కెట్కు రానున్నాయి. వీటిని శుక్రవారం నుంచి కేవలం 10 రోజుల్లో ఎలా తూకం చేస్తారు. ఇది సాధ్యం కాదని, అందువల్ల మరో నెల గడువు ఇస్తే రైతులకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా జొన్నలను తూకం చేసి 80 లేదా 100 లారీలలో లోడ్ చేయించి రవాణా చేస్తే రైతులకు ఉపయోగపడుతుందని రైతు సంఘం వినతి పత్రంలో కోరింది. ఈ సందర్భంగా సంఘం ప్రముఖులు కన్నె శివమూర్తి, దొడ్డ బసవనగౌడ, రాజయ్య, యాల్పి సురేష్, మల్లికార్జున, మేటి దివాకర్, చెన్నరెడ్డి, దివాకర్రెడ్డి, శివప్రసాద్రెడ్డి, విశ్వనాథ్గౌడ తదితరులు పాల్గొన్నారు.